CM Chandrababu Visits Tirumala: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. తన మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన విచ్చేశారు.
ముఖ్యమంత్రి వెంట ఆయన ధర్మపత్ని నారా భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి, మనుమడు దేవాన్ష్ ఉన్నారు. రేపు (శనివారం, మార్చి 21) దేవాన్ష్ పుట్టినరోజు కావడంతో, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పొందేందుకు ఈ పర్యటన ఖరారైంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రికి తిరుమలకు చేరుకోనున్నారు. ఈ రాత్రికి వీరంతా తిరుమలలోనే బస చేయనున్నారు.

నారా వారి కుటుంబం ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం అందించడం ఆనవాయతీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, శనివారం ఒకరోజు అన్నవితరణకు అయ్యే ఖర్చు రూ. 44 లక్షలను టిటిడి (TTD) కి విరాళంగా సమర్పించనున్నారు.
శనివారం ఉదయం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక సేవల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరియు పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు.

