కోడి గుడ్డుపై ఈకలు సరే… దీనిపై చప్పుడు ఏది?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా రంగం ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాపక్షం వహించాల్సిన పత్రికలు.. పార్టీలకు కరపత్రాలుగా మారిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో సమాజంలో ఏ సమస్య వచ్చినా, ఏ సంఘటన జరిగినా.. దాన్ని పూర్తిగా రాజకీయ పార్టీల కోణంలోనే పరిగణలోకి తీసుకుంటూ స్పందిస్తున్నాయి. ఈ సమయంలో ఏ సమస్య గురించి పూర్తిగా తెలియాలన్నా.. ఫలానా పత్రిక చదవాలి, ఫలానా ఛానల్ చూస్తే అసలు విషయం తెలియదు అనే ఆలోచనకు ప్రజానికం వచ్చేసిందని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఈ సమయంలో ఓ ఆసక్తికర చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితులను ఒకసారి గమనిస్తే.. ప్రపంచం ఎప్పుడూ చూడని సమస్య, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు సైతం వణికిపోయిన వేళ.. ఏపీలో కోవిడ్ సమయంలో జగన్ సర్కార్ చక్కగా, సమయస్పూర్తిగా స్పందించిందనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే.. అప్పట్లో ‘పారాసిట్మాల్’ అనే మాట జగన్ నోటి నుంచి రాగానే.. ఓ వర్గం మీడియా వెటకారాలు మొదలుపెట్టేసింది. కట్ చేస్తే.. జగన్ చెప్పిన మాటే వ్యాక్సిన్స్ వచ్చే వరకూ ప్రత్యామ్నాయ మార్గం అయ్యింది.. ఆ సదరు వర్గం మీడియా సైడ్ అయిపోయింది. ఇక ఎవరికైనా మాస్క్స్ అందడంలో కాస్త ఆలస్యం జరిగినా.. రంకెలు వేసేసిన పరిస్థితి అనే చర్చా జరిగింది.

కట్ చేస్తే… ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఎటు చూసినా సమస్యలు, ప్రమాదాలు.. తద్వారా ప్రజలకు గాయాలు, మరణాలు సంభవిస్తున్న పరిస్థితి. అయితే ఆ సమస్యలను చివరి పేజీలో చివరి లైన్ కి కొన్ని పత్రికలు పరిమితం చేస్తుంటే.. మరికొన్ని మీడియా ఛానల్స్.. ఆ ప్రమాదాలను సైతం గత ప్రభుత్వానికి అంటగట్టే దుర్మార్గపు సాహసానికి ఒడిగడుతున్నాయి. కల్తీ పాలతో, కలుషిత నీటితో ఎంతో మంది అమాయక ప్రజలు మరణిస్తున్నా.. వీటిపై సదరు వర్గం మీడియాలో స్పందన కరువు, చర్చలు కనుమరుగు.

ఇక తెలంగాణలో ఇటీవల జరిగిన సమ్మక్క సారక్క జాతరలో కోవా బన్ పై పలు మీడియా సంస్థలు విరుచుకుపడిపోయాయి… నెగిటివ్ కి నేటివ్ కి తేడా తెలియని పలువురు జర్నలిస్టులు ఆ కోవా బన్ను అమ్ముకునే సామాన్యుడిపై తమ పైత్యాన్ని ప్రదర్శించే పనికి పూనుకున్నారు. అయితే… ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రతినిథుల డ్రగ్స్ పార్టీ వ్యవహారం తీవ్ర కలకలం రేపినా.. మౌనాన్నే తమ భాషగా చేసుకుని ముందుకు వెళ్లాయి పలు  మీడియా సంస్థలు! పైగా ఆ పనికి మాలిన పనికి నిస్సిగ్గు సమర్థనలు చేసే పనికి పూనుకోవడం కచ్చితంగా తీవ్రమైన పైత్యమనే చెప్పాలి.

ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్.. డ్రగ్స్ పార్టీలో పట్టుబడని అనంతరం… ఓ వర్గం మీడియా చేసిన కవరింగుల సందడి.. మీడియా అంటే ప్రజల్లో పోతున్న గౌరవాన్ని, నమ్మకాన్ని మరింత పెంచాయని చెప్పాలి. పైగా, స్వయంగా పోలీసు ఉన్నతాధికారి స్పందిస్తూ.. టీడీపీ ఎంపీ బ్లడ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది అని చెప్పినా… దాన్ని సైతం తెరమరుగు చేసే పనికి పూనుకున్నారు పలువురు స్వయంప్రకటిత మేధావులు, జర్నలిస్టులు!

న్యూట్రల్ జర్నలిస్టుగా చెప్పుకునే మరో వ్యక్తి అయితే… డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీపై వైఎస్ జగన్ చేసిన విమర్శలను కులం కోణంలో చూస్తూ… బీసీలంటే జగన్ కు ఎంత చిన్న చూపో అర్ధమవుతుందా అంటూ… జర్నలిస్టు సమాజం సైతం సిగ్గు పడే స్థాయిలో ప్రజెంటేషన్ ఇచ్చారు! డిబేట్స్ లో బూతులు మాట్లాడుతూ తన అజ్ఞానాన్ని, అనాగరికతను బహిరంగ పరుచుకున్న సదరు జర్నలిస్టు.. ఈ పనికి పూనుకుని విపరీతంగా ట్రోలింగ్ కు గురయ్యారు.. సోషల్ మీడియా జనాలకు బంతి అయిపోయారు.. ఇక సాధారణ ప్రజానికం దృష్టిలో అజ్ఞానిగా మిగిలిపోయారు! టీవీ ఛానల్స్ లో వచ్చే పలు కామెడీ షోలకు మించిన కామెడీ అందిస్తున్నారంటూ కామెంట్లను సొంతం చేసుకున్నారు.

వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా.. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తుంటే.. వారి కులాలు, మతాలు, ప్రాంతాలపై విశ్లేషణలు చేస్తూ ఆత్మవంచన చేసుకుంటున్న ఓ వర్గం మీడియా… ఆ కోడి గుడ్డుపై ఈకలు పీకే పనులు మానుకుని.. తీవ్రమైన సమస్యలపై అయినా పార్టీలకు అతీతంగా, ప్రజాపక్షం వహిస్తూ న్యూట్రల్ గా స్పందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది చదివిన తర్వాత, ఇది విన్న తర్వాత అయినా వారిలో మార్పు రావాలని కోరుకుందామ్..