Rajnath Singh: సరిహద్దులో ఉద్రిక్తత.. త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ అత్యవసర భేటీ!

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో భారత-పాక్ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఉదయం త్రివిధ దళాధిపతులు, సీడీఎస్‌తో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల పాకిస్థాన్ దాడులను భారత్ సమర్థంగా తిప్పికొట్టిన తర్వాత తక్షణ భద్రతా వ్యూహాలపై చర్చించడానికి ఈ భేటీ ఏర్పాటయ్యింది.

గురువారం రాత్రి రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు, మిస్సైల్ దాడులకు ప్రయత్నించగా, భారత భద్రతా దళాలు వెంటనే స్పందించి వాటిని అడ్డుకున్నాయి. అంతకుముందు భారత సైన్యం పీఓకే, పాకిస్థాన్‌లో ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ప్రతీకార దాడులు జరిపింది. తొమ్మిది ప్రాంతాల్లో దాడులు జరిపిన ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందారని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

నిన్న పాక్ సైన్యం పఠాన్ కోట్, ఉధంపూర్, జమ్మూ ప్రాంతాలపై దాడి ప్రయత్నాలు చేయగా, భారత సైన్యం అప్రమత్తమై ప్రతిఘాతం చూపింది. అంతేకాదు, ఎల్ఓసీ వద్ద పాక్ ఆర్మీ పోస్టులపై జరిపిన ఎదురుదాడుల్లో వాటిని ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ ఘటనలతో రెండు దేశాల సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు మరింత కఠినమయ్యాయి.

భవిష్యత్తు దాడులను ఎదుర్కోవడానికి సైనిక వ్యూహాలపై సమగ్ర సమీక్ష జరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తుందని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయనున్నట్లు సమాచారం. దేశమంతా ఈ పరిణామాలను ఉత్కంఠగా గమనిస్తోంది.

ఆమీర్ ఇంట్లో అల్లు || Cine Critic Dasari Vignan About Aamir Khan in Allu Arjun Movie || AA22 || TR