తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు ఇవే

అత్యంత ఉత్కంఠ రేపిన తెలంగాణ కేభినేట్ సమావేశం కొద్దిక్షణాల పాటే సాగింది. ఈ సమావేశంలో ముందస్తు అంశాలపై చర్చ జరగలేదని మంత్రులు ప్రకటించారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావు, కడియం శ్రీహరి మీడియాకు వెల్లడించారు.

ముందస్తు ముచ్చట ఇప్పుడు చర్చకు రాలేదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తేల్చి పారేశారు. రానున్న కేబినెట్ సమావేశంలో ముందస్తు విషయంపై చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించిన అంశాలను మాత్రమే తాము వెల్లడించామని చెప్పారు. 

సిఎం కేసిఆరే కేబినెట్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడిస్తారని కబురు అందినా తర్వాత మంత్రులు వివరాలు చెప్పారు. కేబినెట్ లో ఏ నిర్ణయాలు తీసుకున్నారో కింద చదవండి.

బీసీలకు హైదరాబాద్‌లో 70 కోట్లతో 71 ఎకరాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఈటల రాజేందర్ వెల్లడించారు.

హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ కోసం మరో 5 ఎకరాలు కేటాయింపు నిర్ణయం.

గోపాల మిత్రులకు వేతనం రూ. 3,500 నుంచి రూ. 8500 పెంపు.

అర్చకుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏండ్లకు పెంపు.

ఆశా కార్యకర్తల గౌరవ వేతనం రూ. 6 వేల నుంచి 7500లకు పెంచుతూ నిర్ణయం.

వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న సెకండ్ ఏఎన్‌ఎంలుకు రూ.11 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు.

ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న 9 వేల మందికి కనీస వేతనాలు పెంపు.

కాంట్రాక్ట్ డాక్టర్ల వేతనం రూ. 40 వేలకు పెంచినట్లు ప్రకటించారు. 

ఈ సమావేశంలో ఈ నిర్ణయాలే తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించడంతో ఇప్పటికి కూడా సిఎం కేసిఆర్ ముందస్తు ముచ్చటను ఇంకా తన గుప్పిట పట్టారని తెలుస్తోంది. ప్రగతి నివేదన సభ వేదిక మీద ముందస్తు ముచ్చట చెబుతారా? లేక మరో కేబినెట్ వరకు ఆగాలా అన్నది చూడాల్సి ఉంది.

తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ రాజకీయ పరిణామాలను శాసిస్తున్నారు కేసిఆర్. కేసిఆర్ వ్యూహాలు తెలియక ఇటు టిఆర్ఎస్ పార్టీ నేతలతోపాటు అటు ప్రతిపక్ష నేతలు కూడా సతమతమవుతున్నారు. 

మరో కేబినెట్ సమావేశం ఎప్పుడు ఉంటుంది? ప్రగతి సభలో కేసిఆర్ ఏం చెబుతారు అన్నది ఇంకా హాట్ టాపిక్ గానే ఉన్నది.