యాదాద్రి పుణ్యక్షేత్రం తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచింది. ఆలయాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పనులు చేస్తుంది. యాదగిరి లక్ష్మీ నరసింహా స్వామి అంటే అందరికి ఎనలేని భక్తి. కానీ ఈ భక్తి ముసుగులో అక్కడ రక్తి నడుస్తుంది. పాపాలు పోగొట్టి జీవితాలు వెలుగులోకి వస్తాయనుకంటే అక్కడ కొంత మంది చిన్నారులను దుర్మార్గులు పాపపు పనిలోకి నెట్టేసి వాళ్ల జీవితాలను చీకట్లోనే చిదిమేస్తున్నారు. ఊహ తెలియని పసికందులు బలైపోతున్నారు. అసలు యాదాద్రి పుణ్య క్షేత్రంతో నడుస్తున్న చీకటి దందాపై తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ…
యాదాద్రి పుణ్యక్షేత్రం కావడంతో అక్కడ చాలా రోజుల నుంచే కొంత మంది ముఠాగాళ్ల వల్ల వ్యభిచార కేంద్రాలు వెలిశాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాదాద్రి అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పోలీసులు నిత్యం సోదాలు జరిపి వ్యభిచార కేంద్రాలు లేకుండా చేశారు. అయితే వ్యభిచారమే ఆధారంగా చేసుకున్న వారి వక్ర బుద్ది ఎక్కడ పోతది. లక్షణాలు పోవు కదా అందుకే వారి కన్ను చిన్న పిల్లలపై పడింది. బాలికలను కిడ్నాపు చేసి వారిని వ్యభిచార వృత్తిలోకి దింపాలని పథకం వేశారు ఈ కంత్రీగాళ్లు.

యాదాద్రి పుణ్యక్షేత్రం
అది యాదాద్రి పట్టణంలోని కళ్యాణి అనే మహిళ ఇల్లు. స్థానికులకు అదే పనిగా ఇంటి లోపలి నుంచి బాలిక ఏడుపులు వినిపిస్తున్నాయి. కళ్యాణి గతంలో వ్యభిచార గృహాలు నిర్వహించిందని స్థానికులకు తెలుసు. అందుకే అవి మాములు ఏడుపు కాదని వారికి అర్ధమైంది. ఆ అనుమానంతో వారు జూలై 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనిఖీలకు వెళ్లిన పోలీసులకు కళ్యాణి ఇంట్లో ఇద్దరు బాలికలు కనిపించారు. అందులో ఒక బాలిక అదే పనిగా ఏడుస్తుండటంతో పోలీసులు ఆ పాప గురించి కళ్యాణిని ప్రశ్నించారు. ఆ పాప తమ బంధువుల పాపంటూ కళ్యాణి పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి బాలికను మరో ప్రాంతం నుంచి ఎత్తుకొచ్చామని అంగీకరించింది. అదే రోజు పోలీసులు ఏక కాలంలో కళ్యాణి బంధువుల ఇంటిపై కూడా దాడి చేసి మరో 10 మంది బాలికలను రక్షించారు. మరుసటి రోజు మరో నలుగురు అమ్మాయిలను వ్యభిచార కూపం నుంచి రక్షించారు. కళ్యాణి అనే మహిళా తాను వ్యభిచార గృహం నిర్వహించటం లేదని తాను మారిపోయానని స్థానికులను నమ్మించిదట. ఈ పిల్లలను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు, వ్యభిచార నిర్వహకులకు అమ్మటానికి తీసుకొచ్చారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

వ్యభిచార నిర్వహకురాలిని ప్రశ్నిస్తున్న అధికారులు
పోలీసుల విచారణలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నపిల్లలు త్వరగా ఎదగటానికి వారి హార్మోన్ల వృద్ది కొరకు ఇంజక్షన్లు ఇస్తున్నారు. అలాగే బెడ్ రూములలో మంచాల కింద బంకర్లు తవ్వి పిల్లలను అందులో దాచిపెడుతున్నారని ఆశ్యర్యపోయే నిజాలు తెలిశాయి. అనురాధ నర్సింగ్ హోం ద్వారా చిన్నారులకు ఇంజక్షన్లు ఇస్తున్నారని తెలిసి ఆ నర్సింగ్ హోంను జిల్లా అధికారులు సీజ్ చేశారు. నిర్వాహకులు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారో తెలుసుకొని పోలీసులు సైతం ఆశ్చర్య పోయారు. శంకర్ అనే వ్యక్తి పిల్లలను తీసుకొచ్చి వీరికి అప్పగించేవారని తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ మరణించటంతో వీరిలోనే ఒకరు ఈ ముఠాను నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. రక్షించబడ్డ 15 మంది బాలలు మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లులోని ఉజ్వల హోంలో ఉన్నారు. నిందితుల్లో 11 మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాదాద్రి సెక్స్ రాకెట్ కోణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వ్యభిచార కూపాలున్నాయని అక్కడ కూడా ఇటువంటి తతంగాలే ఉంటాయని పలువురు అంటున్నారు. సిగ్నల్స్ వద్ద పిల్లలను ఎత్తుకొని అడుక్కునే వారు కూడ ఇటువంటి దురాగతాలకు పాల్పడుతుండొచ్చని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టి పోలీసులు స్టింగ్ ఆపరేషన్లు చేస్తే మరికొంత మంది జీవితాలు కాపాడవచ్చని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పట్టుబడ్డ వ్యభిచార నిర్వాహకులు
యాదాద్రి ఘటనతో పిల్లలు తప్పిపోయిన తల్లిదండ్రులు యాదాద్రికి లైన్లు కడుతున్నారు. వీరిలో తమ బిడ్డ ఉందేమో అన్నటువంటి ఆతృతతో తమ బిడ్డల ఫోటోలు చేతుల్లో పట్టుకొని ఆశగా వస్తున్నారు. ప్రకాశం నుంచి వచ్చిన దంపతులు తమ పాపను గుర్తు పట్టారు. ఇన్నాళ్లు తమపాప వ్యభిచార కూపంలో మగ్గిందని తెలిసిన ఆ పాప తల్లి స్టేషన్ లోనే కుప్పకూలిపోయింది. అన్ని వివరాలు పరిశీలించాక గుర్తించిన బాలికలను తల్లిదండ్రులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.

తమ పిల్లలు ఉన్నారేమో అన్న ఆశతో తల్లిదండ్రులు
యాదగిరిగుట్టలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాలకు కూడా విస్తరించిదని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికలను తీసుకొచ్చే ముఠాలు సిద్దిపేట, కొడకండ్ల, రాంచంద్రాపూర్ ప్రాంతాల్లో బాలికలను పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. సిద్దిపేటకు చిలకలూరిపేట, పెద్దాపురం, యాదాద్రికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడి నుంచి అక్కడికి.. అక్కడి నుంచి ఇక్కడికి అమ్మాయిలను మారుస్తారని తెలుస్తోంది. ఇంత కాలం చూసీ చూడనట్టు వ్యవహరించిన పోలీసులు యాదాద్రి ఘటనతో అలర్టయ్యి నిఘాపెట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకొని బాలికలకు విముక్తి కల్పిస్తామని అంటున్నారు.

కళ్యాణి ఇంట్లో దొరికిన బాలిక
ఈ కేసు విషయమై సీరియస్ గా తీసుకున్న రాచకొండ సీపీ మహేష్ భగవత్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. అవి ఏంటంటే “ రాచకొండ కమిషనరేట్ ఏర్పడిన రెండేళ్ల నుంచి మానవ అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇప్పటి వరకు 170 మందిపై కేసులు నమోదు చేశాం. 350 మందిని అరెస్టు చేశాం. 220 మంది చిన్నారులు, యువతులు, మహిళలను వ్యభిచార కూపాల నుంచి రక్షించగలిగాం.ఇప్పటికే 5 గురిపై పీడి యాక్టు పెట్టాం. పట్టబడ్డ 11 మందిపై కూడా పీడి యాక్టు పెడతాం. పవిత్రమైన యాదాద్రి క్షేత్రంలో అపవిత్రం అనే మాట లేకుండా చేస్తాం. చిన్నారులను ఇంత చిత్ర హింసలు పెట్టి ఇంజక్షన్లు ఇచ్చి హోర్మోన్లు పెంచడం చాలా బాధాకరం. ఐదేళ్ల చిన్నారులకు కూడా సెక్స్ చేస్తుంటే చూపించి శిక్షణలా చేయడం అనేది దారుణం. ఇవి విన్నాక ఒక మనిషిగా నేను చాలా బాధపడ్డాను. ఇటువంటివి మళ్లీ పునరావృతం కానివ్వం. నిందితులకు శిక్షపడే వరకు ఈ కేసును ప్రత్యేక కేసుగా తీసుకొని విచారిస్తాం. గుర్తించిన పిల్లలను తల్లిదండ్రులు ఆధారాలు చూపిస్తే నిబంధనల ప్రకారం వారికి అప్పగిస్తాం” అని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
యాదాద్రి ఘటనతో తెలుగు రాష్టాలు ఉలిక్కిపడ్డాయి. చిన్నారులకు ఇంత నరకయాతనా అంటూ ప్రజలంతా సానుభూతిని వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెడితే మరికొందరిని రక్షించవచ్చని వారిని చీకటి జీవితాల నుంచి రక్షించవచ్చని పలువురు అంటున్నారు.
