జగన్ కు ఆహ్వానం!: రేవంత్ ప్రమాణ స్వీకారానికి అతిథులు వీరే!

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఈ కార్యక్రమంలో రేవంత్‌ తో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ సమయంలో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి జారయయ్యే ముఖ్య అభ్యర్థుల జాబితాలో కీలకమైన పేర్లు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌ తో పాటు పలువురు ఏఐసీసీ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమయంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు కీలక నేతలు ముఖ్య అతిధులుగా హాజరవ్వనున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో సీఎంగా రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ నేతలు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. ఇందులో భాగంగా… కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పంపించారు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛతీస్‌ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్ హాజరుకానున్నారు.

వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, వీరప్ప మెయిలీ, వాయిలార్ రవి, కుంతియా, మాణిక్కం ఠాగూర్, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, కురియన్, మరికొందరు నేతలకు ఆహ్వానం పంపించారు. ఇదే సమయంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిసింది.

అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, గాదె ఇన్నయ్య, కంచ ఐలయ్యతోపాటు మరికొందరు ఉద్యమ కారులకు ఆహ్వానం పంపించినట్లు సమాచారం. ఇదే క్రమంలో తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ సీఎం కేసీఆర్‌ కు కూడా ఆహ్వానం పంపినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నది వేచి చూడాలి.

ఇదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తోపాటు మరో తెలుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తోపాటు మాజీ సీఎం చంద్రబాబు, పలువురు సినీ నటులు, హైకోర్టు చీఫ్ జస్టిస్, వివిధ సంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తుంది. మరి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హస్తిన నేతలతో వైఎస్ జగన్ వేదిక పంచుకుంటారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.