ఆ 200 ల్లో కాకుండా… 10 కోట్లు పర్సనల్ గా ఇస్తానంటున్న సుఖేష్!

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టై కొన్నాళ్లుగా జైల్లో ఉంటున్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్.. రైల్వే శాఖకు ఓ లేఖ పంపాడు. ఇటీవల ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాధ బాధిత కుటుంబాలకు రూ.10 కోట్ల ఆర్థిక సాయం అందిస్తానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆ విరాళాన్ని అంగీకరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరాడు.

ఆర్థిక నేరాల్లో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో సుఖేష్ చంద్రశేఖర్.. రైల్వే శాఖకు ఏకంగా రూ.10 కోట్ల విరాళం ఇస్తానని చెబుతున్నాడు. అయితే ఈ పదికోట్లూ తన పర్సనల్ అమౌంట్ అని చెప్పడం గమనార్హం. ఎవరి వద్దయినా పర్సనల్ డబ్బే ఉంటుంది.. పక్కోడి డబ్బు ఉంటుందా అనే సందేహనని కాసేపు పక్కనపెడితే… ఆ సొమ్మును స్వీకరించాలంటూ విజ్ఞప్తి చేశాడు.

అవును… ఆ పదికోట్ల డబ్బునూ తన వ్యక్తిగత నిధుల నుంచి పన్ను చెల్లించిన సొమ్ము నుంచే విరాళంగా ఇస్తున్నానని సుఖేష్ ప్రకటించాడు. తక్షణమే డిమాండ్ డ్రాఫ్ట్ ను తయారుచేసి రూ.10కోట్ల విరాళాన్ని పంపిస్తానని తెలిపాడు. ఈలోపు డీడీ ఏ పేరుమీద తీయాలనే వివరాలు తీహార్ జైల్లో ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అందజేయాలని కోరాడు.

ఈ సందర్భంగా తాని ఇస్తున్న ఈ రూ. 10 కోట్లను బాధిత కుటుంబాల పిల్లల విద్యా ఖర్చుల కోసం వినియోగించాల్సిందిగా కేంద్రాన్ని కోరిన సుఖేష్… నిరుపేదలకు సహాయం చేయడం బాధ్యత గల భారతీయ పౌరుడిగా, ఆర్థిక సామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా తన బాధ్యత అని లేఖలో పేర్కొన్నాడు!

కాగా… ఇటీవల ఒడిశాలోని బాలేశ్వర్లో మూడు రైళ్లు ఢీకొన్న దుర్ఘటనలో 288 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 1100 మంది గాయపడిన సంగతి తెలిసిందే.