(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)
విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సారధ్యంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలి. మారిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకోలేదని ఆ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తానే స్వయంగా పరిశ్రమను నిర్మిచబోతున్నట్లు మంత్రివర్గం తీర్మానం చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. చూడటానికి బాగానే ఉన్నా లోతుగా పరిశీలించితే ప్రభుత్వం తొందరపడినట్లు అర్థం అవుతుంది.
విభజన చట్టం 2014 డిసెంబర్ నాటికి నివేదిక ఇవ్వాలని పేర్కొంది. దాదాపు 4 సంవత్సరాలు గోప్యంగా ఉంచడమే కాకుండా కాంగ్రెస్ చట్టం సరిగా చేయలేదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో రాజకీయంగా విడిపోయిన తర్వాత 4 నెలల్లో ఎన్నికల వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను నిర్మాణం చేపట్టాలని నిర్ణయించడం రాజకీయ కోణం మాత్రమే కనిపిస్తుంది. రాయలసీమ లో పరిశ్రమలు ఏర్పాటు చేసి రాజకీయంగా లబ్ది పొందాలని టిడిపి ఆలోచన చేస్తే అభ్యంతరం లేదు. ఈ నిర్ణయం కనీసం రెండు సంవత్సరాలు ముందు చేసి ఉంటే అర్థం చేసుకోవచ్చు.
2019 లో ఎలాగూ కేంద్రంలో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి వస్తుందని బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు. వారు అనుకున్నట్లే రాహుల్ గాంధీ ప్రధాని కాగలిగితే అపుడు కేంద్రమే ఉక్కు పరిశ్రమ స్థాపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అలాంటి ప్రకటన చేసింది. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెపితే నమ్మిన బాబు గారు అదే పార్టీ కడప ఉక్కు నిర్మిస్తామని చెప్పిన మాటలు ను ఎందుకు నమ్మడం లేదు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి పునుకుంటే రేపు వచ్చే కేంద్రం ప్రభుత్వం ఎలాగూ ప్రారంభించి నారు కాబట్టి మీరే చూడండి అంటే రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వల్పకాలం లో చేయగలిగింది ఆవకాశం ఉంటే కేంద్రం నిర్మాణం చేపట్టేవిధంగా ప్రయత్నం చేయడం లేదా రాబోయే కేంద్ర ప్రభుత్వం వచ్చేన వెంటనే నిర్మాణం చేసేవిధంగా ప్రయత్నించడం మంచిది.
(యం. పురుషోత్తమ రెడ్డి, కన్వీనర్. రాయలసీమ మేధావుల ఫోరం, తిరుపతి,ఫోన్ నెం.9490493436)
