కాంగ్రెస్ లోకి షర్మిళ… విలీనం డేట్ వచ్చేసింది!

తెలంగాణలో షర్మిళ రాజకీయ ప్రస్థానం కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయిందనే సంగతి తెలిసిందే. అప్పటివరకూ తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్సార్టీపీని స్థాపించి పాదయాత్ర చేసిన షర్మిళ… అధికార బీఆరెస్స్ పై తీవ్రస్థాయిలో పోరాడారు.

ఈ క్రమంలో… కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం డీకే శివకుమార్ ఆ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఒకరోజు షర్మిళ.. ఆయనతో భేటీ అయిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో షర్మిళ వైఎస్సార్ టీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకోసం పరితపిస్తుందని కొందరంటే.. లేదు షర్మిళ పార్టీకి కాంగ్రెస్ పార్టీ విలీనం ఆప్షన్ ఇచ్చిందని మరికొంతమంది అన్నారు.

అయితే అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనం కన్ ఫాం అనే చర్చ మరింత బలపడింది. అయితే షర్మిళ మాత్రం పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విలీనానికే ఆమె అంగీకరించారని.. ఇందుకు సంబంధించిన తేదీ కూడా ఫిక్సయ్యిందని అంటున్నారు. అవును… వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ భ‌విష్యత్‌ పై ఊహాగానాల‌కు తెర‌ప‌డే స‌మ‌యం ఆస‌న్నమైందని తెలుస్తోంది.

కాంగ్రెస్‌ లో వైఎస్సార్‌ టీపీని ష‌ర్మిల విలీనం చేస్తార‌నే ప్రచారం గ‌త కొంత కాలంగా విస్తృతంగా సాగుతోన్న నేపథ్యంలో… అందుకు ముహూర్తం ఫిక్సయ్యిందని అంటున్నారు. కాంగ్రెస్‌ తో డీకే శివ‌కుమార్ చ‌ర్చలు ఇప్పటికే కొలిక్కి వ‌చ్చాయని సమాచారం. ఇదే క్రమంలో ఇటీవ‌ల ష‌ర్మిల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దల‌తో త‌న పార్టీ విలీనం, అలాగే జాతీయ పార్టీలో త‌న పాత్రపై చ‌ర్చించారని సమాచారం.

ఇందులో భాగంగా… ఈ నెల 22న ష‌ర్మిల కాంగ్రెస్ కండువాను క‌ప్పుకోనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల చర్చలూ పూర్తయ్యాయని అంటున్నారు. ఈ నెల 22వ తేదీన షర్మిళ కాంగ్రెస్ నాయకురాలిగా కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో తన తండ్రి వారసత్వాన్ని ఏమేరకు కంటిన్యూ చేస్తారనేది వేచి చూడాలి.

కాగా… కాంగ్రెస్ నాయ‌కుడిగా, గాంధీ కుటుంబానికి అత్యంత ఇష్టమైన వ్యక్తిగా వైఎస్సార్ పేరు పొందిన సంగతి తెలిసిందే. సోనియాగాంధీ ఆశీస్సుల‌తో 2004లో వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగా.. ఆ త‌ర్వాత రెండోసారి 2009లో ఏపీలో కాంగ్రెస్‌ ను ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు.

ఆ సంగతి అలా ఉంటే… కాంగ్రెస్ లోకి షర్మిళ రాకను ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు ఆహ్వానిస్తుండగా… పక్కపార్టీల నుంచి వచ్చిన కొందరు వ్యతిరేకిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది!