BRS Leaders Arrested: నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
నేతల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన, శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పోలీస్ స్టేషన్లను ముట్టడించారు. నర్సంపేట వెళ్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.

నర్సంపేటలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆయన పనిచేసిన ఆర్టీసీ డిపో వరకు తీసుకెళ్లి నివాళులు అర్పించాలని కార్మికులు, కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అందుకు అనుమతించలేదు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య భారీ తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. 22 ఏళ్లుగా సంస్థకు సేవ చేసిన వ్యక్తికి కడసారి నివాళి అర్పించే అవకాశం ఇవ్వకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఉద్రిక్తతలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి, కార్మికుల విజ్ఞప్తిని సానుభూతితో పరిశీలించాలని సూచించారు. “22 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వ్యక్తికి, తోటి కార్మికులు నివాళులు అర్పించుకోవడం వారి హక్కు. డిపో వద్ద నివాళులు అర్పిస్తేనే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది” అని బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం నర్సంపేటలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

