Telangana Politics: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా పిప్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై ఆయన కీలక హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పిప్రి ప్రజలు ఇచ్చిన ధైర్యమే మూలమని ఆయన కొనియాడారు.
జిల్లాకు త్వరలోనే విమానాశ్రయం రాబోతోందని సీఎం ప్రకటించారు. వీలైతే జూన్ 2వ తేదీన దీనికి శిలాఫలకం వేస్తామని స్పష్టం చేశారు. వేలాది ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసి, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తామని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దీనిపై సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో త్వరలోనే కొత్త యూనివర్సిటీని నిర్మిస్తామని, బాసర పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

గత ప్రభుత్వంలో ప్రతిపక్షాలను నిర్బంధించే సంస్కృతి ఉండేదని, కానీ తమ ప్రభుత్వం ‘ప్రజాపాలన’ను నమ్ముకుందని రేవంత్ రెడ్డి అన్నారు. “మా పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా వేదికలపై మాట్లాడే అవకాశం ఇస్తున్నాం. పార్టీలతో సంబంధం లేకుండా, మా ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో కూడా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి చేస్తున్నాం.” ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా కొనసాగుతోందన్నారు.

బోథ్ రెవెన్యూ డివిజన్ వంటి డిమాండ్లపై స్పందిస్తూ.. కేంద్ర నిబంధనల ప్రకారం 2027 మార్చి వరకు జిల్లాల సరిహద్దు మార్పులకు అవకాశం లేదని సీఎం వివరించారు. ఆ గడువు ముగిసిన తర్వాత జ్యుడీషియల్ కమిషన్ వేసి ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను చెరిపివేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

