Revanth – KTR: రేవంత్‌ రెడ్డికి భయపడటం ఏంటి?: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు ‘పేమెంట్ కోటాలో సీఎం అయిన’ రేవంత్‌ రెడ్డి లాంటి వ్యక్తికి భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు.

టీవీ ఛానల్‌కు ఇచ్చిన ముఖాముఖిలో కేటీఆర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా, రాజకీయంగా విమర్శించారు.

 “రేవంత్ రెడ్డి ఉన్నది 3 ఫీట్లే, కానీ 30 ఫీట్లు ఉన్నట్లుగా డైలాగులు కొడతాడు,” అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ‘పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి’ అయ్యారని ఆయన ఆరోపించారు. తమపై పెట్టే ఉత్తి కేసులు ఏవీ నిలబడవని, రేవంత్ రెడ్డి తనను తాను అంతకంటే ఎక్కువగా ఊహించుకోవద్దని కేటీఆర్ సూచించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ‘ఏటీఎం’ లా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయస్థాయిలో పోటీ చేసే అన్ని ఎన్నికలకు డబ్బులు తెలంగాణ నుంచే వెళుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అంగీకరించారని, ఇంత జరుగుతున్నా షా ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు.

హామీలకు డబ్బులు లేవు, ఢిల్లీకి మాత్రం వేల కోట్లు: “రైతు బంధు, పెన్షన్ పెంపు, తులం బంగారం వంటి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కానీ ఢిల్లీకి మాత్రం వేల కోట్ల రూపాయలు పంపిస్తున్నారు,” అని కేటీఆర్ విమర్శించారు.

రాహుల్‌కు ముడుపులు, బీజేపీ సహకారం: తెలంగాణ నుంచి వేలాది కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ముడుపుల రూపంలో పంపిస్తున్నారని, దీనికి బీజేపీ సహకారం కూడా ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర, హర్యానా సహా ప్రస్తుతం జరుగుతున్న బీహార్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పోరాటానికి డబ్బులు ఇక్కడి నుంచే వెళుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Ayyannapatrudu Warns Jagan, But Why Forgot Pawan Kalyan Rules | AP Assembly | Telugu Rajyam