Reserve Bank: ఇంకా తిరిగి రాని రూ.6,266 కోట్ల 2000 నోట్లు: ఆర్బీఐ తాజా నివేదిక

రెండేళ్ల క్రితం ఉపసంహరణకు గురైన రూ.2000 నోట్లు ఇప్పటికీ దేశంలో గణనీయంగా మిగిలినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. ఏప్రిల్ 30, 2025 నాటికి రూ.6,266 కోట్ల విలువైన 2000 రూపాయల నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అంటే 98.24 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరగా, మిగిలిన 1.76 శాతం ఇప్పటికీ వ్యవస్థలోనే తిరుగుతున్నాయి.

2023 మే 19న ఆర్బీఐ రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అప్పటికి దేశవ్యాప్తంగా రూ.3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో డిపాజిట్, మార్పిడి అవకాశాలను ఆర్బీఐ 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో అందుబాటులో ఉంచింది. ఆ తర్వాత నుంచి దేశంలోని 19 ప్రాంతీయ ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ నోట్లు మార్పిడి లేదా డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఇప్పటికీ ఈ నోట్లను మార్చుకోవాలనుకునే వారు ఆర్బీఐ కార్యాలయాలను ప్రత్యక్షంగా సంప్రదించవచ్చు. ఈ అవకాశం లేదు అనుకునే వారు పోస్టాఫీసు ద్వారా తమ వద్ద ఉన్న 2000 నోట్లను ఆర్బీఐ కార్యాలయాలకు పంపించవచ్చు. ఆ డబ్బును వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేసే విధానం కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

తప్పనిసరిగా ఉపసంహరణ ప్రక్రియ ముగిసినప్పటికీ, ఈ నోట్లు ఇప్పటికీ చట్టబద్ధంగా చెలామణి కావడానికి అనుమతిస్తున్నామని కూడా ఆర్బీఐ గుర్తుచేసింది. అయితే ఆ నోట్లను వినియోగించేందుకు ఆమోదించడంలో ప్రజలు, వ్యాపారులు ఇబ్బంది పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని వీటిని వీలైనంత త్వరగా బ్యాంకుల్లో జమ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

కులగణన వార్ || Analyst Ks Prasad About Caste Census & Credit War || Telangana BJP Vs Congress || TR