రాహుల్ అన్ స్టాపబుల్ బైక్ రైడ్… పిక్స్ వైరల్!

కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహమో… లేక, భారత్ జూడో యాత్ర ఇచ్చ్న ప్రోత్సాహమో తెలియదు కానీ… కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యవహారశైలి పూర్తిగా మారిపోయిందని.. అప్పట్లో ఉన్నట్లుగా లేరని, జనాల్లో బాగా కలిసిపోతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయాలను ఇప్పటికే పలువురు నేతలు చెప్పుకున్న సంగతి తెలిసిందే.

ఈ సమయంలో గతంలో యూఎస్ లో ట్రక్ లో పర్యటించి.. అక్కడున్న ఇండియన్స్ తో ముచ్చటించి, అనంతరం వారితో అలాపాహారం కూడా సేవించిన రాహుల్ గాంహీ… తాజాగా బైక్‌ రైడ్‌ చేపట్టారు. ఇందులో భాగంగా… భారత్‌ – చైనా సరిహద్దుల్లో బైక్ పై దూసుకుపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అవును… కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ లోని లేహ్‌ లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌ – చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్‌ సరస్సు కు ఆయన బైక్‌ రైడ్‌ చేపట్టారు. ఈ సందర్భంగా రైడ్‌ ప్రారంభానికి ముందు రాహుల్‌ మాట్లాడారు.

“ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్‌ గాంధీ) చెప్పేవారు” అని అన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ తమ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకుంది.

ఇక రైడ్ సందర్భంగా ఈ రాత్రికి ఆయన పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌ లో బస చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతిని ఈ సరస్సు వద్దే చేసుకోనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

కాగా… గత గురువారం రాహుల్‌ లేహ్‌ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత రెండు రోజుల పాటే ఇక్కడ ఉండాలని భావించినా.. ఆగస్టు 25 వరకు తన పర్యటనను పొడిగించుకున్నారు. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్‌ లద్దాఖ్‌ కు రావడం ఇదే తొలిసారి.

ఆ సంగతి అలా ఉంటే… సెప్టెంబరు 10న లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్మెంట్‌ కౌన్సిల్‌ – కార్గిల్‌ ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌… స్థానిక నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో రాహుల్‌.. లేహ్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.