Prakash Raj: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, డీలిమిటేషన్ ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఈ అంశంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించడమే కాకుండా, పవన్ కల్యాణ్కు బహిరంగ చర్చకు సవాల్ విసిరారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన ప్రక్రియలో ఆటంకాలు కలగడానికి ప్రతిపక్షాలే కారణమని సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆరోపించారు.
పవన్ కల్యాణ్ “చారిత్రక అవకాశాన్ని విపక్షాలు చేజార్చాయి. ఇది దేశ పురోగతిని అడ్డుకోవడమే.” అని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు “ప్రతిపక్షాల చర్య కోట్లాది మంది మహిళలకు ద్రోహం చేయడమే. ఈ విషయాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.” అని పేర్కొన్నారు.

ప్రకాశ్ రాజ్ కౌంటర్: “దక్షిణాది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి”
ఈ వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్, ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, దాన్ని అమలు చేయడానికి డీలిమిటేషన్తో ముడిపెట్టడం కేంద్రం ఆడుతున్న డ్రామా అని ఆయన ఆరోపించారు.
పవన్ కల్యాణ్కు సవాల్: “ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని డిప్యూటీ సీఎంను చేశారు.. వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో తగ్గిపోతుంది. ఈ అంశంపై మీతో చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా?” అంటూ పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు.

సీఎం చంద్రబాబుపై చురకలు: ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీరు అబద్ధం చెబుతున్నారని దేశం గుర్తుంచుకుంటుంది సార్.. జస్ట్ ఆస్కింగ్” అంటూ తనదైన శైలిలో విమర్శించారు. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దని ఆయన హితవు పలికారు.
దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య తగ్గుతుందనే ఆందోళనల మధ్య, మహిళా రిజర్వేషన్ల అంశం ఇప్పుడు ప్రాంతీయ అస్తిత్వ పోరాటంగా మారుతోంది. ఒకవైపు ప్రభుత్వం విపక్షాలపై దాడి చేస్తుంటే, మరోవైపు ప్రకాశ్ రాజ్ వంటి వారు దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలను ప్రశ్నిస్తున్నారు. ఈ “మాటల యుద్ధం” ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

