నోటి దురుసుకి కేరాఫ్ అడ్రస్ అయిన మంత్రి కొడాలి నానిని రాజకీయంగా కెలికేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సెటైర్లు వేయడంలో దిట్ట అయిన పేర్ని నానిని కూడా పవన్ కళ్యాణ్ వదల్లేదు. రైతుల సమస్యలపై కృష్ణా జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించాలన్న జనసేన అధినేత ఆలోచన వెనుక అసలు వ్యూహమేంటో.. ఆ పని పూర్తయ్యాక అందరికీ అర్థమయ్యింది. ‘మేం రైతుల సమస్యల మీద, రోడ్ల గుంతల మీదా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. చేతనైతే ఆ రెండిటికీ సమాధానం చెప్పండి..’ అంటూ ఇప్పుడు జనసేన నేతలు ‘లా పాయింట్’ చాలా గట్టిగా లాగుతున్నారు. ‘వకీల్ సాబ్’ తన పర్యటనలో రాజకీయ విమర్శలు చేస్తే, దానికి మంత్రులు ఇచ్చిన కౌంటర్ నూటికి నూరుపాళ్ళూ నవ్వులపాలైపోయింది.
‘ఇదిగో మేం రైతుల్ని ఇలా ఉద్ధరిస్తున్నాం, రోడ్ల గుంతల్ని ఇలా పూడ్చుతున్నాం..’ అని చెప్పలేని దుస్థితి అధికార పార్టీ నేతలది. దాంతో, ‘తంతే, పక్క దేశంలో పడతావ్..’ అనేశారు కొడాలి నాని. రాజకీయాల్లో ఇలా ‘తన్నే’ పరిస్థితి వుంటుందా.? ఎందుకు వుండదు.. కొన్నాళ్ళ క్రితం కాకినాడలో జనసేన నేత సందీప్ పర్యటిస్తే, అక్కడి వైసీపీ ఎమ్మెల్యే.. జనసేన శ్రేణుల మీద దాడి చేసిన విషయాన్ని మర్చిపోగలమా.? కానీ, అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. అధికార పార్టీ నేతలు వాడకూడని మాట ఏదన్నా వాడితే, అది అధికార పార్టీకి చాలా పెద్ద మైనస్ అయి కూర్చుంటుంది. ఎందుకంటే, గ్రౌండ్ లెవల్లో అధికార పార్టీ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరి. నిజానికి, పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ నేతల స్పందనని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కి కూడా మింగుడుపడే వ్యవహారం కాదు. ‘సీఎం సాబ్..’ అంటూ పవన్ కళ్యాణ్ కాస్త మర్యాదగా మాట్లాడితే, ‘షకీలా సాబ్’ అని పవన్ మీద, కొడాలి నాని రెచ్చిపోయారు. దాంతో, జనసేన మద్దతుదారులు ‘ఖైదీ సాబ్’ అంటూ ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని. అసలు ఊపిరి లేని జనసేన పార్టీకి ఈ వివాదంతో ఆక్సిజన్ అందించినట్లయ్యింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరు. రాష్ట్రంలో జనసేన పార్టీకి ఇంతమంది నేతలున్నారా.? అంటూ ఆశ్చర్యపోతున్నారంతా. దానిక్కారణం ఆ స్థాయిలో జనసేన నేతలు మీడియా ముందుకొచ్చారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా సరిగ్గా కవరేజ్ ఇవ్వలేదుగానీ, ఇచ్చి వుంటే.. జనసేన పార్టీకి వెయ్యి రెట్లు మైలేజ్ రాత్రికి రాత్రి వచ్చి పడేదే. అయితే, వచ్చిన ఈ కాస్త మైలేజ్ని జనసేన పార్టీ కాపాడుకోగలగుతుందా.? లేదా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక్కరోజులో చల్లారిపోయే పొలిటికల్ వేడి కాదు.. అను నిత్యం, ఏదో ఒక అంశంపై జనసేన నేతలు మీడియా ముందుంటే.. ఆ పార్టీ ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకునే అవకాశం వుంటంంది.