ఎర్రకోటపై మువ్వన్నెల రెపరెపలు… ప్రధాని ప్రసంగంలో హైలెట్స్ ఇవి!

యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌ తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

అవును… తొలుత రాజ్‌ ఘాట్‌ లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధాని.. ఆ తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం భారతీయులకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని మోడీ చెప్పారు.

బాపూజీ చూపిన అహింసా మార్గంతో స్వాతంత్ర్యం సాధించామని ప్రధాని గుర్తుచేశారు. ఈ ఏడాది అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతిని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాణి దుర్గావతి, మహాభక్తురాలు మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణమిదని చెప్పుకొచ్చారు. కొద్దివారాల క్రితం మణిపుర్‌ లో జరిగిన హింస అత్యంత బాధాకరమని మోడీ అన్నారు.

అవును… ఈ సందర్భంగా మణిపూర్‌ లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల పట్ల స్పందించారు. మణిపూర్‌ లో శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోన్నట్లు చెప్పారు. యావత్ దేశం మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని.. ప్రధాని భరోసా ఇచ్చారు. శాంతి ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా… మణిపూర్ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తోన్నాయని చెప్పడం గమనార్హం. కాగా.. మణిపూర్ ఘటనలో మోడీ & కో పూర్తిగా ఫెయిలయ్యారనే కామెంట్లు పుష్కలగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో… తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నవ భారత నిర్మాణం జరుగుతోందని చెప్పిన మోడీ.. గడువు కంటే ముందే కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని అన్నారు. అనంతరం… ఇది మోడీ ప్రభుత్వం అని, ఆత్మనిర్భర్ భారత్‌ కు ప్రతీక అని ప్రధాని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు.. దాన్ని అనుకున్న సమయం కంటే ముందే ఛేదించడమూ తమకు తెలుసునని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ఈ సారి ప్రకృతి వైపరీత్యాలు దేశాన్ని అల్లకల్లోలానికి గురి చేశాయని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఊహకందని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ కష్టకాలంలో బాధితులకు దేశ ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆప్తులను కోల్పోయిన వారి కుటుంబాలకు మోడీ సానుభూతిని తెలియజేశారు.

2014లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ది 10వ స్థానంలో ఉండేదని, ఇప్పుడు అయిదో స్థానానికి చేరుకున్నామని ప్రధాని మోడీ అన్నారు. తన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయంటూ ప్రతిపక్షాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కాగా… ప్రస్తుతతం కేంద్ర ప్రభుత్వం అప్పులు కోటి కోట్ల రూపాయలు దాటిన సంగతి తెలిసిందే.

సత్తాచాటు, మార్పు చెందు అన్న పద్ధతిలో దేశం ముందడుగు వేస్తోంది.. ప్రతి సంస్కరణలోనూ ఓ పరమార్థం ఉంది.. సంస్కరణలకు జల్‌ శక్తి శాఖ ఓ ఉదాహరణ.. పర్యావరణహితంగా ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నాం.. బలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే సంస్కరణలు సాధ్యమని మోడీ తెలిపారు.

Live: Independence Day 2023: PM Modi speech on 77th Independence Day of India | Red fort