Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి: పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశం అవసరం?

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన నేపథ్యంలో, ప్రధాని మోదీకి పలు ప్రతిపక్ష నేతలు లేఖలు రాశారు. ఈ దాడికి సంబంధించిన పరిస్థితులను పార్లమెంట్ వేదికగా సమగ్రంగా చర్చించాలనే డిమాండ్‌తో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు సంయుక్త లేఖను ప్రధానికి పంపారు. భద్రతా వైఫల్యాలపై ప్రభుత్వం స్పందించాలన్నదే వీరి ప్రధాన ఉద్దేశం.

ఈ దాడి తర్వాత ఉగ్రవాదంపై దేశం ఒకటిగా ఉన్నదని ప్రపంచానికి బలమైన సంకేతాన్ని పంపించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు స్పష్టంగా చెప్పారు. పార్లమెంట్‌లో చర్చ ద్వారా దేశ ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

కేవలం కాంగ్రెస్ మాత్రమే కాదు, ఇతర ప్రతిపక్ష నేతలు కూడా ఇదే కోణంలో స్పందించారు. టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ, ఆప్ నేత సంజయ్ సింగ్, మాజీ మంత్రి కపిల్ సిబల్ వంటి వారు ప్రధాని మోదీ స్పందించాల్సిన సమయం ఇదే అని అభిప్రాయపడ్డారు. కపిల్ సిబల్ అయితే ఏకగ్రీవంగా తీర్మానం చేసేలా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదివరకు జరిగిన అఖిలపక్ష సమావేశానికి కూడా ప్రధాని మోదీ హాజరుకాకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఖర్గే సైతం ప్రధాని చొరవగా వ్యవహరించాల్సిన అవసరముందని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మరోసారి అదే విజ్ఞప్తిని లేఖ రూపంలో మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం ప్రతిపక్షాల డిమాండ్లను పరిగణలోకి తీసుకుంటుందా? ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుందా? అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఓడినా గెలిచినా జగన్ జగనే || KCR Praises Ys Jagan & Shocking Comments On Chandrababu || Telugu Rajyam