Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. మరణించిన వారిలో ముగ్గురు తెలుగువారు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని శోకసంద్రంలో ముంచింది. పర్యాటకులపై పక్కా ప్లానింగ్‌తో జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకు 28 మంది మృతి చెందగా, వారిలో ముగ్గురు తెలుగువాళ్లు కూడా ఉన్నారని సమాచారం. మృతుల్లో ఒకరు హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మనీష్ రంజన్ కాగా, మరొకరు విశాఖ వాసి చంద్రమౌళి. కాగా, కావలికి చెందిన మధుసూదన్ బెంగళూరులో నివాసముంటూ పర్యటన కోసం కాశ్మీర్ వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

విశాఖకు చెందిన చంద్రమౌళి ఈ నెల 18న ఐదుగురితో కలిసి పర్యటనకు వెళ్లారు. మే 26న తిరిగి రావాల్సి ఉండగా, దురదృష్టవశాత్తు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. సహచర టూరిస్టులే ఆయన మృతదేహాన్ని గుర్తించారని తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులు పహల్గామ్ బయలుదేరినట్లు తెలిసింది. చంద్రమౌళి రెండు సంవత్సరాల క్రితం వైజాగ్‌లో ఫ్లాట్ కొనుగోలు చేశారని, ఇటీవలే మొక్కలకు నీళ్లు పోయాలని చెప్పి వెళ్లారని అపార్ట్‌మెంట్ సెక్రటరీ చెప్పిన మాటలు విషాదాన్ని మిగిల్చాయి.

కావలి వాసి మధుసూదన్, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ పర్యటనకు వెళ్లి ఉగ్రవాదుల బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉగ్రదాడి తర్వాతా అతన్ని వెంబడించి కాల్చిచంపిన తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీష్ రంజన్ కూడా దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ అమలులో ఉంది. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. డ్రోన్లు, చాపర్స్‌తో సెర్చ్ కొనసాగుతోంది. కేంద్ర హోం శాఖ, ఎన్ఐఏ అధికారుల బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీలో అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహిస్తున్నారు.

సింగర్ సునీత ఫేక్ || Pravasthi Sensational Video on Singer Sunitha Comments || PaduthaTheeyaga || TR