భారత సైన్యం బుధవారం తెల్లవారుజామున పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఛేదించిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇప్పుడు దేశమంతా చర్చకు కేంద్రబిందువుగా మారింది. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ దాడులు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రసంస్థలపై కేంద్రీకృతమై, కీలక శిబిరాలను ధ్వంసం చేశాయి.
ఈ దాడుల్లో భారత సైన్యం, నౌకాదళం, వైమానిక దళం సమన్వయంతో పనిచేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆపరేషన్ ప్రగతిని పర్యవేక్షించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్లోని బహవల్పూర్, మురిడ్కే వంటి ప్రాంతాలతో పాటు, పీవోకేలోని ముజఫరాబాద్, కోట్లి ప్రాంతాల్లో ఐదు శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఈ దాడులకు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు ఎందుకు పెట్టారు అన్నది. సాధారణంగా, ‘సిందూరం’ అంటే వివాహిత హిందూ మహిళలు ధరిచే కుంకుమ. కానీ, ఈ సందర్భంలో ఈ పేరు పెట్టడం వెనుక పహల్గామ్ దాడికి ప్రతీక ఉంది. ఎందుకంటే, ఆ దాడిలో ఉగ్రవాదులు పర్యాటకుల పేర్లు, మతం తెలుసుకుని, అమాయకులను హతమార్చారు.
ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళి అర్పించడం, ఈసారి న్యాయం జరగబోతోందన్న బలమైన సందేశాన్ని ఇచ్చేందుకే ‘సిందూర్’ అనే సంకేతాత్మక పేరు పెట్టారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపై భారత్ ఉగ్రవాదం పై మరింత గట్టి వైఖరి తీసుకుంటుందన్న సంకేతం కూడా ఈ ఆపరేషన్ ద్వారా స్పష్టమవుతోంది. దీనిపై అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతికూలత వస్తుందో చూడాలి.