వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షనేత చంద్రబాబు ఏదో సందర్భంలో మాట్లాడుతూ “నా కొడుకును అమెరికా పంపించి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో చదివించి ప్రయోజకుడిని చేశాను. మీరు మాత్రం మీ కొడుకును రౌడీగా, సంఘవ్యతిరేక శక్తిగా తయారు చేశారు” అనే అర్ధం వచ్చేలా వైఎస్ ను ఉద్దేశించి వేలు చూపిస్తూ ఆవేశంగా మాట్లాడారు. అప్పట్లో అది నిజమేనేమో అనుకున్నాను.
గుప్పిట మూసి ఉన్నంతవరకే రహస్యం…
అప్పటికి లోకేష్ గురించి ఈ లోకానికి తెలియదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గూర్చి కూడా ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి వ్యాపారవేత్తగా బెంగుళూరు లో స్థిరపడి, ఏనాడూ తండ్రి అధికారంలో కానీ, పాలనలో కానీ జోక్యం చేసుకునేవాడు కాదు. అసలు జగన్ అనే కొడుకు వైఎస్ కు ఉన్నాడని ఎవరో కొందరికి తప్ప చాలామందికి తెలియదు. లోకేష్ మాత్రం అప్పటికి రాజకీయాల్లో వేలు పెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. అయినప్పటికీ పెద్దగా ప్రాచుర్యంలో లేడు. చంద్రబాబు లాంటి చాణక్యుడికి ఏకైక కుమారుడు కావడం, అమెరికాలో పెద్ద విశ్వవిద్యాలయంలో చదువుకోవడం, మహానటుడు ఎన్టీఆర్ కు మనవడు కావడం లాంటి కొన్ని కారణాలవలన లోకేష్ మహా మేధావి అయి ఉండవచ్చునని, భాషా, సాహిత్యం, నటన అనేవి తాతలకాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఆ ఘనవారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఉంటారని నాబోటివారు భావించారు. అలాగే చంద్రబాబు అంతటివాడు చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా రౌడీయే అయి ఉంటాడని, వారి కుటుంబం మీద ఫ్యాక్షనిస్టులు అనే ముద్ర పచ్చమీడియా వాళ్ళు వేశారు కాబట్టి జగన్ కూడా బాంబులు, బరిసెలు పట్టుకుని తిరుగుతుంటాడేమో అని అనుకున్నారు వాస్తవాలు తెలియని అమాయకులు.
జన్మనిచ్చినవారు గర్వించేలా జగన్
అయితే ఆ తరువాతికాలంలో విధి వక్రించి వైఎస్ మరణించడం, తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడం, 2009 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చెయ్యడం, ఆ తరువాత సోనియా మీద తిరుగుబాటు, పదవికి రాజీనామా, సొంత పార్టీని పెట్టుకోవడం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి సీబీఐని అడ్డం పెట్టుకుని వేధించడం, జైల్లో పెట్టడం, కోర్టు విచారణలు, మొదటి ఎన్నికల్లోనే అరవై ఏడు అసెంబ్లీ స్థానాలు గెల్చుకోవడం, చరిత్ర సృష్టించిన పాదయాత్ర చెయ్యడం, తదుపరి ఎన్నికల్లో శాసనసభలో ఎనభై శాతం సీట్లను గెల్చుకోవడం, ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలతో దూసుకుని దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రులతో మూడవ స్థానాన్ని పొందడం…ఇదంతా వర్తమాన చరిత్రే. గత పదేళ్లలో జగన్మోహన్ రెడ్డిలో ఫ్యాక్షనిస్టు, రౌడీని, గూండాను ఈ రాష్ట్రం చూడలేదు. ఆయన ఎవరిమీదా రౌడీయిజం ప్రదర్శించగా చూడలేదు. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా చెదరని చిరునవ్వు, మొక్కవోని ధైర్యం, వ్యవస్థలలో అక్రమాలను ప్రశ్నించే సాహసం, పేదప్రజలపట్ల చెరిగిపోని మమకారం, అధికారంలో ఉన్నప్పుడే సమాజానికి మేలు చేసి మంచిపేరు తెచ్చుకోవాలనే తాపత్రయం, ఉత్తమ భాషాజ్ఞానం, వాదనాపటిమ, వినయవిధేయతలు లాంటి పెద్దలు ఆశించే లక్షణాలు మాత్రమే దర్శించాము. చంద్రబాబు ఆరోపించిన లక్షణాలు ఏవీ జగన్మోహన్ రెడ్డిలో లవలేశం కూడా కనిపించలేదు. పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ రికార్డు మెజారిటీతో ఘనవిజయాన్ని సాధించాడు. దివంగత జనకుడి ఆత్మకు శాంతి చేకూర్చాడు. మాతృమూర్తి గర్వించేట్లు చేశాడు భార్యాపిల్లలను ఉప్పొంగిపోయేట్లు చేశాడు.
తల్లితండ్రులకు తలవంపులు తెచ్చిన లోకేష్ నాయుడు
తద్భిన్నంగా ఎంతో మేధావి అని లోకేష్ పట్ల ఈ రాష్ట్రం పెట్టుకున్న ఆశలను భ్రమలుగా రుజువు చెయ్యడానికి లోకేష్ కు ఎక్కువ కాలం పట్టలేదు. ముఖ్యంగా లోకేష్ మాట్లాడే విధానం చూసి జనం నివ్వెరపోయారు. అత్యంత కఠినమైన సంస్కృత సమాసపదభూయిష్టమైన సంభాషణలను, వేదమంత్రాలు సైతం అలవోకగా పలకగల మహానటుడు నందమూరి తారకరామారావు దౌహిత్రుడు కనీసం తెలుగు పదాలు కూడా ఉచ్ఛారణదోషం లేకుండా పలకలేని యథాగతుడా అని ముక్కున వేలు వేసుకుంటున్నారు. తాను పోటీ చేసున్న మంగళగిరి నియోజకవర్గం పేరును కూడా సరిగా పలకలేక నవ్వులపాలయ్యాడు. ఒక మాజీ ముఖ్యమంత్రికి మనుమడుగా, మరొక ముఖ్యమంత్రికి తనయుడిగా, లక్షలకోట్ల రూపాయల అధిపతిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక దొడ్డిదోవన శాసనమండలిలో ప్రవేశించి ఏకంగా మూడు శాఖలకు మంత్రి అయ్యాడు. పోనీ ఆ పదవులనైనా సమర్ధవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారా అంటే అదీ లేడు. వేలకోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి రాష్ట్ర సంపదను దోచుకున్నాడని ఆరోపణలకు గురయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో మంత్రి హోదాలో పోటీ చేసి ఘోరంగా పరాజయం పాలయ్యాడు.
ఈ వయసులో ఇంత పిరికితనమా!?
ఇక దేశంతో పాటు రాష్ట్రాన్ని కూడా కరోనా వైరస్ అతలాకుతలం చెయ్యగా, ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలలో ధైర్యాన్ని నింపుతూ వారికి అండగా నిలబడాల్సిన లోకేష్ కరోనా కాలంలో హైద్రాబాద్ వెళ్లి తన రాజభవనంలో గుట్టు చప్పుడు కాకుండా దాక్కున్నాడు. ఎవరో జీతగాళ్ల ద్వారా ట్వీట్లు పెట్టిస్తూ చెట్లకు తల్లకిందులుగా వేలాడుతూ చెట్టు భారాన్ని తామే మోస్తున్నామని భ్రమించే తీతువుపిట్టలా ట్వీటర్ పిట్టలా మారిపోయాడు. రాష్ట్రంలో అమరావతి రైతులపేరుతో దీక్షా నాటకాలు జోరుగా సాగుతున్నా ఒక్కరోజు కూడా వారి మధ్య కూర్చుని దీక్షలో పాల్గొనే సాహసాన్ని ప్రదర్శించలేకపోయాడు. వరదలతో రాష్ట్రం బీభత్సమైనా వరదప్రాంతాల్లో తిరిగే తెగువను చూపించలేక చతికిలపడ్డాడు. తనకన్నా వయసులో పదేళ్లు పెద్దవాడైన ముఖ్యమంత్రిని “జగన్ రెడ్డి” అని సంబోధిస్తూ తన అహంకారాన్ని బయటపెట్టుకుంటున్నాడు. అమరావతిలో భూకుంభకోణాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
వేపచెక్కను ఎంత అరగదీసినా ఏమి ఫలము?
ఇక లోకేష్ చేసే ట్వీట్లు, పార్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. లోకేష్ కు కనీస జ్ఞానం కూడా లేదని, ఆయనకు చదువు వంటబట్టలేదని, పదిమందిలో మాట్లాడటం కూడా రాదని లోకానికి తెలిసిపోయి చంద్రబాబు పట్ల సానుభూతి వెల్లువెత్తుతున్నది! గత ఐదారేళ్లుగా తనయుడిని వారసుడిగా చెయ్యాలని చంద్రబాబు ఎంత గింజుకులాడుతున్నా, దాన్ని అందుకునే ప్రజ్ఞావిశేషం లోకేష్ నాయుడిలో శూన్యం అని తేలిపోయింది. వివేకం లేదు, విఙానం లేదు..చదువు లేదు, లోకజ్ఞానం లేదు, సమర్ధత లేదు…. వాగాడంబరం కూడా లేదు మరి! డెబ్బై ఏళ్ల వయసులో చంద్రబాబుకు ఆజన్మశోకంలా మిగిలిపోయాడు లోకేష్ నాయుడు. ఎన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నా, ఎన్ని కోట్ల రూపాయలను కుమ్మరిస్తున్నా, ఎన్ని వేలకోట్ల రూపాయల ఆస్తులను పోగేసి ఇచ్చినా, అరగదీసి వెలికితీయాలని చంద్రబాబు ఎంతగా తపనపడుతున్నా, లోకేష్ నాయుడు బొగ్గుగానే మిగిలిపోవడం చంద్రబాబు దురదృష్టం. ఒక యువనాయకుడు ఎలా వినయంగా మెలగాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ను చూసి నేర్చుకోవాలి. పోరాటగుణం ఎలా ఉండాలో, సాహసం ఎలా ఉండాలో, తెగింపు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. యువకుడు ఎలా ఉండకూడదో, ఎలాంటి లక్షణాలను అలవరచుకోకూడదో లోకేష్ నాయుడును చూసి నేర్చుకోవాలి! గంధపు చెక్కను అరగదీస్తే సువాసనలు వెదజల్లుతుంది కానీ, తుమ్మచెక్కను తురిమితే కంపు లేవడం తప్ప ప్రయోజనమేముంది?
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు