జైలులో నాగర్ కర్నూల్ స్వాతి రెడ్డి ఎలా ఉందంటే?

నాగర కర్నూల్ స్వాతి.. భర్త సుధాకర్ రెడ్డిని ప్రియుడు రాజేష్ తో కలిసి అతి కిరాతకంగా  2017 నవంబర్ 27న హత్య చేసిన విషయం తెలిసిందే. స్వాతి బండారం బయట పడిన తర్వాత ఆమెను  2017 డిసెంబర్ 11న పాలమూరు జైలుకు తరలించారు. అప్పటి నుంచి స్వాతి జైలులోనే మగ్గుతున్నది. ఇటీవల స్వాతికి బెయిల్ కూడా వచ్చింది కానీ ఆమెకు జమనాత్ ఇచ్చి తీసుకెళ్లటానికి ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో జైలులోనే ఉంది.

జైలు న్యాయవాది విజయమోహన్ స్వాతికి 8 నెలల బెయిల్ తీసుకు వచ్చారు. ఈ నెల 16న స్వాతికి బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైనా స్వాతికి జమనాత్ ఇచ్చే వాళ్లు లేక స్వాతి జైలులోనే ఉంది. అయితే ఎట్టకేలకు స్వాతికి జమానత్ లు ఇచ్చేందుకు పలువురు ముందుకు వచ్చారు.  కానీ కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకు రాకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరికొందరు ఆశ్రయం కల్పించేందుకు ముందుకు వచ్చినా కుటుంబ సభ్యుల ఒత్తిడితో వెనుకకు తగ్గినట్టు తెలుస్తోంది. ఆమెను బయటికి పంపిస్తే భద్రతా సమస్యలు వస్తాయని ఎవరైనా స్వాతిపై దాడి చేసే అవకాశం ఉండటంతో జైలు అధికారులు కూడా సందిగ్దంలో పడ్డారు. ఎందుకంటే స్వాతి తండ్రి గుండు చేయించుకొని తన కూతురు చనిపోయిందని ప్రకటించాడు. కన్న మమకారం ఉన్నా సమాజం ముందు తలెత్తుకోలేక ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతిని దగ్గరికి తీసే అవకాశం లేదని తెలుస్తోంది. అత్తింటి వారు ఆగ్రహంతో దాడి చేసే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

జైలులో స్వాతి నరకయాతన  అనుభవిస్తుంది. పిల్లలకు దూరం కావడంతో తల్లడిల్లు పోతుంది. చేసిన తప్పుకు కుంగిపోతూనే కన్న ప్రేమకు దూరమవడంతో బాధపడుతుంది. జైలు నుంచి బయటికి వచ్చాక పిల్లలతో కలిసి జీవించాలని స్వాతి ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. జైలు జీవితం స్వాతిలో మార్పు తీసుకొచ్చిందని ఆమెతో పాటు జైలు జీవితం గడిపి వచ్చిన ఖైదీల ద్వారా తెలుస్తోంది. జైల్లో పిల్లలను తలుచుకొని చాలాసార్లు ఏడ్చేదని వారంటున్నారు. బయటికి వస్తే ఏదో ఒక పని చేసుకొని పిల్లలతో కలిసి బతుకుతానని వారితో స్వాతి చెప్పేదట. స్వాతి రెడ్డి పిల్లలు బాబు ఫస్టు క్లాసు, పాప ఎల్ కేజి చదువుతున్నారు. ప్రస్తుతం వీరు స్వాతి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు. స్వాతి జైలు నుంచి వచ్చినా వారు పిల్లలను ఆమెకు అప్పగిస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది.ఎందుకంటే స్వాతికి ఏడాదిలోపే కేసు ట్రయల్ నడిచి మళ్లీ శిక్ష పడితే పిల్లల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందుకే స్వాతికి పిల్లలను ఇవ్వటానికి వారు సంసిద్దంగా లేరని తెలుస్తోంది.

స్వాతికి బెయిల్ మంజూరు కావడంతో ఎవరు కూడా ఆమెను తీసుకుపోవటానికి ముందుకు రావటం లేదు. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడి స్టేట్ హోమ్ కు తరలించాలని అది కూడా కుదరక పోతే హైదరాబాద్ లో ఏదైనా స్వచ్చంధ సంస్థలో చేర్పించాలని అధికారులు భావిస్తున్నారట. స్వాతి బయట ఉంటే జైళ్ల శాఖ నిర్వహించే పెట్రోల్ బంకుల్లో ఎక్కడైనా ఉపాధి చూపించాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నారట. స్వాతి బెయిల్ పై పూర్తి విషయాలు శనివారం తేలనున్నాయి. స్వాతి వీటన్నింటిని అంగీకరించని పక్షంలో బెయిల్ రద్దు చేసి జైలులోనే ఉంచే అవకాశాలు ఉన్నాయని అధికారుల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి స్వాతి కేసు పలు మలుపులు తిరుగుతూ మళ్లీ హాట్ టాపిక్ అవుతుంది.

భర్త సుధాకర్ రెడ్డితోస్వాతి