బిగ్ బాస్ 4: గ‌్రాండ్ ఫినాలేలో సెల‌బ్రిటీల హ‌డావిడి.. ఆర్జీవితో జాగ్ర‌త్త అని స్వాతికి స‌ల‌హా ఇచ్చిన నాగ్

బిగ్ బాస్.. ఎంట‌ర్‌టైన్‌మెంట్ లైక్ నెవ‌ర్ బిఫోర్ అంటూ నాగార్జున మొద‌లు పెట్టిన సీజన్ 4 కార్య‌క్ర‌మం నేటితో ముగియ‌నుంది. 105 రోజుల పాటు స‌క్సెస్ ఫుల్‌గా సాగిన ఈ షో చిన్న పిల్లల నుండి పెద్దాళ్ల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రిని అల‌రించింది. తొలి రోజు కంటెస్టెంట్స్‌ని చూసిన ప్రేక్ష‌కులు వీళ్ళెవ‌రురా బాబు ఒక్క‌టి కూడా తెలిసిన మొహం లేదు అని అనుకున్నారు. కాని ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌గా మారారు. ఎక్క‌డ న‌లుగురు కూర్చున్న ఈ బిగ్ బాస్ గురించే చర్చ జ‌ర‌గ‌గా, నేటితో ఆ ముచ్చ‌టకు ముగింపు ప‌డ‌నుంది. టాప్ 5 లో ఉన్న అఖిల్, సోహైల్, అభిజీత్, అరియానా, హారిక‌ల‌లో ఒక‌రిని విజేత‌గా ప్ర‌క‌టించి సీజ‌న్ 4కు శుభం కార్డ్ వేయ‌నున్నారు

తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 4 కు సంబంధించి ప్రోమో విడుద‌ల చేశారు మేక‌ర్స్ . ఎప్ప‌టిలానే స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున స్టైలిష్ డ్యాన్స్ చేశాడు. ప్ర‌ణీత‌, మెహ‌రీన్, అనీల్ రావిపూడి వంటి సెల‌బ్రిటీల‌తో పాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సూర్య కిర‌ణ్‌, క‌రాటే క‌ళ్యాణి,అమ్మ రాజ‌శేఖ‌ర్ , మెహ‌బూబ్, దివి, లాస్య, మోనాల్‌, గంగ‌వ్వ‌, సుజాత‌, అవినాష్‌, స్వాతి దీక్షిత్, కుమార్ సాయి, నోయ‌ల్, టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీ అంద‌రు ఫినాలేలో ర‌చ్చ‌ర‌చ్చ చేసిన‌ట్టు తాజాగా విడుద‌లైన ప్రోమోని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఎలిమినేట్ అయిన హౌజ్‌మేట్స్‌తో ముచ్చ‌టించే స‌మ‌యంలో స్వాతి దీక్షిత్‌ని ఏం చేస్తున్నావు అని అడ‌గ‌గా, అందుకు ఆర్జీవి గారితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను అని పేర్కొంది. దీనికి వెంట‌నే నాగార్జున జాగ్ర‌త్త అని అన్నారు. దీంతో అక్క‌డ న‌వ్వులు విరిసాయి.

ఇక క‌రాటే క‌ళ్యాణి.. నాగార్జున లాంటి అంద‌గాడి ముందు మేం మాట్లాడడానికి ఏం సరిపోం అన‌గానే వెంటనే మాస్టార్ మీరు మైక్ తీసుకోండ‌ని నాగ్ పంచ్ ఇచ్చారు. ఇక ప్రీవియ‌స్ హౌజ్‌మేట్స్ అల్ల‌ర్లు చేయ‌డంతో ఇది చేప‌ల మార్కెట్ అనుకుంటున్నారా అని అనగానే, అందుకు నాగ్ .. అవును క‌రెక్ట్‌గా చెప్పావు అని నాగ్ అన్నారు. అనంత‌రం హౌజ్‌మేట్స్‌తో స‌ర‌దాగా మాట్లాడారు. ఈ సీజ‌న్‌లో తొలిసారి ఇంటి స‌భ్యుల ద‌గ్గ‌ర‌కు వెళ్ళి అనీల్ రావిపూడి, మెహ‌రీన్‌లు ముచ్చ‌టించారు. అనీల్ రావిపూడి అయితే అచ్చం ఇంటి స‌భ్యుల మాదిరిగా అభిన‌యం ప్ర‌ద‌ర్శించాడు. ఈ ప్రోమో చూస్తే షో ఫుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్ అందించడం ఖాయంగా క‌నిపిస్తుంది.