Mukesh Ambani and Gautam Adani: యుద్ధ వాతావరణంలో దేశానికి అండగా అంబానీ, అదానీ

భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, దేశంలోని టాప్ వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు త‌మ మ‌ద్ద‌తు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశానికి తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఈ ఇద్దరు పారిశ్రామిక దిగ్గజాలు స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను గౌరవించడమే కాక, అవసరమైన సహాయాన్ని అందించేందుకు తాము సిద్ధమని వీరు పేర్కొన్నారు.

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోషల్ మీడియాలో, “ఇలాంటి పరిస్థితుల్లో మన ఐక్యత, మన బలం వెలుగులోకి వస్తాయి. మన సాయుధ దళాల ధైర్యానికి మేము అచంచలమైన మద్దతు ఇస్తాం. దేశం కోసం ఏ అవసరం వచ్చినా వెనకాడం లేదు. జై హింద్!” అని తెలిపారు. ఈ మాటలు సైనికులకు మరింత ధైర్యాన్ని ఇస్తాయని, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కూడా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన స్పందనను వెల్లడించారు. “రిలయన్స్ కుటుంబం దేశానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. అవసరమైన అన్ని సహాయాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. భారత సైన్యం చూపిస్తున్న ధైర్యం, ప్రధాన మంత్రి మోదీ నాయకత్వం లోని తీర్మానాత్మకత అభినందనీయం. మన శాంతికి ఎదురు వచ్చే ప్రతి ముప్పును ధైర్యంగా ఎదుర్కోవడం భారత్ ప్రత్యేకత. జై హింద్, జై హింద్ కి సేనా!” అని తెలిపారు.

దేశం ఇప్పుడు ఉత్కంఠతో వున్న ఈ సమయంలో అంబానీ, అదానీల ప్రకటనలు దేశమంతా ప్రేరణగా మారుతున్నాయి. వ్యాపారవేత్తలు కూడా ఈ విధంగా ఒక్కటిగా నిలవడం దేశ ఐక్యతకు నిదర్శనం. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రకటనలు విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.

Congress Leaders Sad Reaction | India Pak War Updates | Telugu Indian Army Soldier Murali Nayak