రాహుల్ గాంధీని గెలిపించిన ప్రధాని మోడీ.!

2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయ్యింది. ఆయన మీద ఇటీవల అనర్హత వేటు పడగా, దాన్నుంచి ఆయన తాజాగా బయటపడ్డారు. పరువు నష్టం దావా కేసులో, రాహుల్ గాంధీ మీద కొద్ది రోజుల క్రితం అనర్హత వేటు పడింది. ఆయన తన ఎంపీ పదవినీ కోల్పోయారు.

మోడీ సర్కార్ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదిపి, రాహుల్ గాంధీని ఇరికించిందన్నది బహిరంగ రహస్యం. సాక్ష్యాలు బలంగా వున్నాయ్. కోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురయ్యింది. ఆయన దోషిగా తేలారు, జైలు శిక్ష పడింది. అనర్హత వేటు తప్పలేదు.

అనంతరం, రాహుల్ గాంధీ పలు మార్లు న్యాయస్థానాల్ని ఆశ్రయించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎట్టకేలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అనర్హత వేటు ఎత్తివేయబడింది. దాంతో, రాహుల్ గాంధీ తిరిగి ఎంపీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికీ అర్హత సంపాదించారు.

ఈ మొత్తం వ్యవహారంలో, ప్రధాని నరేంద్ర మోడీ తన పరువు పోగొట్టుకున్నట్లయ్యింది. బీజేపీ తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకున్నట్లయ్యింది. శిక్ష వేసింది న్యాయస్థానమే అయినా, తెరవెనుకాల కథ నడిపింది బీజేపీ. దాంతో, దేశవ్యాప్తంగా ఈ కేసు విషయమై బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది.

అది, రాహుల్ గాంధీకి ప్లస్ పాయింట్.! న్యాయస్థానంలో రాహుల్ గాంధీ గెలిచారంటే, అక్కడ మోడీ ఓడిపోయినట్లేనన్న భావన అంతటా వ్యక్తమవుతోంది. ఆ సంగతేమోగానీ, ఈ వ్యవహారంతో మోడీ ఇమేజ్ పడిపోతే, రాహుల్ ఇమేజ్ పెరిగింది. ప్రజల మనసుల్ని రాహుల్ గెలిచేలా చేయడంలో సక్సెస్ అయిన మోడీ, అదే ప్రజల దృష్టిలో పలచనైపోయారు.