విశాఖపట్నం నగరం త్వరలో జరగబోయే పార్టనర్షిప్ సమ్మిట్ (భాగస్వామ్య సదస్సు) ద్వారా భారీ పెట్టుబడులకు, ఒప్పందాలకు వేదిక కాబోతోందని విశాఖపట్నం ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు.
బుధవారం (నేడు) ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఈ నెల 14, 15 తేదీలలో జరగనున్న పార్టనర్షిప్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి డీబీవీ స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడులు, ఒప్పందాలు ఈ సమ్మిట్ ద్వారా సుమారు రూ. 9.8 లక్షల కోట్ల పెట్టుబడుల ఆహ్వానానికి అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అలాగే, దాదాపు 410 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈ ఒప్పందాల ద్వారా 7.5 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ధ్యేయమని నొక్కిచెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, 20 లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, కేంద్ర మంత్రులతో సహా 20 దేశాల నుంచి ప్రతినిధులు ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు హాజరవుతారని తెలిపారు. సాంకేతిక రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తున్నామని, విశాఖను ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉద్ఘాటించారు. భాగస్వామ్య సదస్సు సందర్భంగా పలు ఒప్పందాలకు సంబంధించిన పరిశ్రమలకు శంకుస్థాపనలు కూడా జరుగుతాయని తెలిపారు.

మంత్రి వెంట ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణు కుమార్ రాజు, జిల్లా కలెక్టర్ అధికారులు ఉన్నారు.
మరోవైపు, విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రి నెఫ్రాలజీ విభాగంలో 9 హిమో డయాలసిస్ మిషన్లను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు.
ఎన్టీపీసీ తమ సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత) నిధులలో భాగంగా సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో ఈ డయాలసిస్ మిషన్లను సమకూర్చింది. ఈ సహకారానికి మంత్రి ఎన్టీపీసీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం వైద్యానికి పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని నొక్కిచెప్పారు. ‘సంజీవిని’ పేరుతో హెల్త్ రికార్డులను డిజిటలైజేషన్ చేస్తున్నామని, పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించామని వివరించారు. కేజీహెచ్లోని నెఫ్రాలజీ విభాగం ఉత్తమ సేవలు అందిస్తోందని మంత్రి ప్రశంసించారు.

