- సుమారు ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రస్థానం..
- సినిమా రంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పద్మవిభూషణ్, మహారాష్ట్ర భూషణ్, బంగా బిభూషన్, జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు లెక్కలేనన్ని మరెన్నో అవార్డులను సాధించిన విజయం..
- సంగీత ప్రియుల హృదయాలను వారి వయస్సు, భాషతో సంబంధం లేకుండా కొల్లగొట్టిన స్వరం..
- 20 భారతీయ భాషల్లో సుమారు 12,000కు పైగా పాటలు పాడిన గాత్రం..
- 92 ఏళ్ల శరీర వయస్సులో మూగబోయిన వైనం..
ఇది నాలుగు మాటల్లో “తెలుగురాజ్యం” చెప్పే ఆశా భోస్లే జీవన సంగీత ప్రయాణం!
అది 1933 వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీ… మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా, గోర్ లో పండిట్ దీనానాథ్ మంగేష్కర్ – శేవంతి దంపతులకు ఓ అమ్మాయి జన్మించారు. నాడు ప్రపంచానికే కాదు వారికీ తెలిసి ఉండదు.. ఆ క్షణం జన్మించిన అమ్మాయి భారతదేశ సంగీత సామ్రాజ్యానికి స్వర్ణయుగపు స్వరం కాబోతుందని.
ఈ క్రమంలో.. శాస్త్రీయ గాయకుడు, నటుడైన పండిట్ దీనానాథ్, ఆశా భోస్లేకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు కన్నుమూశారు. ఆ తర్వాత ఆ కుటుంబం ముంబైకి తరలివెళ్లింది. అక్కడ భోస్లే, ఆమె అక్క లతా మంగేష్కర్ గాయకులుగా, నటీమణులుగా చిత్రసీమలో తమ కెరీర్ ను ప్రారంభించారు.
1943 నాటికి ఆమె మరాఠీ చిత్రం ‘మాఝా బాల్’ కోసం ‘చలా చలా నవ బాలా’ అనే హిట్ పాటను రికార్డ్ చేశారు. అనంతరం.. గాయనిగా హిందీ చిత్రాలలోకి అరంగేట్రం 1948లో ‘చునరియా’ చిత్రం కోసం ‘సావన్ ఆయా’ పాటతో జరిగింది. అక్కడ నుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పినా అతిశయోక్తి కాదు.
యాభై, అరవై, డెబ్భైల దశాబ్దాల బాలీవుడ్ స్వర్ణయుగానికి చెందిన దిగ్గజాలలో ఒకరిగా పరిగణించబడిన ఆ దిగ్గజ గాయని… ఆమె సోదరి లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ముఖేష్, మన్నా డే వంటి వారితో గాత్రాన్ని పంచుకున్నారు.. యుగాలు నిలిచిపోయే పాటలను అందించారు!
ఆ తర్వాత 1990 – 2000 దశకం ప్రారంభంలోనూ ఆ కాలపు ఆధునిక, పాప్-ప్రభావిత శైలికి అనుగుణంగా తన వేగాన్ని కొనసాగించిన భోస్లే.. ఏఆర్ రెహమాన్ తో ‘రంగీలా’ చిత్రం నుండి ‘తన్హా తన్హా’.. ‘రంగీలా రే’.. వంటి హిట్ పాటలు పాడారు. ఇక ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’ చిత్రంలోని ‘జరా సా ఝూమ్ లూ మై’ వంటి హిట్ పాటలు తన ఖాతాలో వేసుకున్నారు.
ఇక.. అద్నాన్ సమీతో కలిసి ‘కభీ తో నజర్ మిలావో’ వంటి ఇండిపాప్ పాటలను కూడా విడుదల చేశారు. తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాలో ‘నాలో ఊహలకు, నాలో ఊసులకు..’ పాటతోనూ ఆమె అలరించారు.
ఈ క్రమంలో… 2013లో ఆమె ‘మై’ చిత్రంలో నటిగా ప్రధాన పాత్ర పోషించి.. తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
అయితే ఈ ప్రయాణం ఏప్రిల్ 12, 2026 ఆదివారం నాడు ముంబైలో ఆగిపోయింది.. గొంతు మూగబోయింది.. కొన్ని కోట్ల హృదయాలను ధ్రవింపచేసింది.. కోట్లాది కన్నీటి చుక్కలను నివాళిగా అందుకుంది.
ఈ వార్తను ధృవీకరిస్తూ స్పందించిన భోస్లే కుమారుడు ఆనంద్ భోస్లే.. “మా అమ్మ ఈరోజు కన్నుమూశారు.. ఆమె నివసించిన లోయర్ పరేల్ లోని కాసా గ్రాండేలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రజలు ఆమెకు చివరి నివాళులు అర్పించవచ్చు.. సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్కులో ఆమె అంత్యక్రియలు జరుగుతాయి” అని తెలిపారు.
ఈ సందర్భంగా ఆశా భోస్లే కు “తెలుగురాజ్యం” నివాళులు అర్పిస్తుంది… భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా.. తన సుస్వర సంగీత నేపథ్య గానంతో భారతదేశ సినీ సంగీత ప్రపంచంలో వినిపిస్తూనే ఉంటుందని బలంగా నమ్ముతుంది.. ఆమె అభిమానులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది.
