KTR Challenges Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో దుమారం: కేటీఆర్ సవాల్, రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు మరోసారి రంజుగా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. “రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఎన్నికల్లో చూసుకుందాం” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

గద్వాల బీఆర్ఎస్ సభలో ప్రసంగించిన కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయన నిజంగా మగాడైతే ఆ పది మంది ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించాలి. అప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఎవరి పనితీరు బాగుందో నిర్ణయిస్తారు” అని అన్నారు. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ మాటను ఎందుకు గుర్తుచేసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. “అవసరమైతే రైలు కింద తలపెడతా కానీ కాంగ్రెస్‌లో చేరను అని చెప్పిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను అంటున్నారు. అది నిజంగా నియోజకవర్గ అభివృద్ధి కోసమా లేక ఆయన సొంత అభివృద్ధి కోసమా?” అని కేటీఆర్ నిలదీశారు.

కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాలను ఒక్కొక్కటి రూ. 3 కోట్ల చొప్పున అమ్ముకున్నారని, దీని ద్వారా దాదాపు రూ.1,700 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రైతులకు అందాల్సిన యూరియాను కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని… రైతులు ఎండలో, వానలో యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆయన మండిపడ్డారు.

ఈ రాజకీయ సవాళ్లు, ఆరోపణలు తెలంగాణలో రాబోయే రోజుల్లో మరింత రాజకీయ వేడిని పెంచనున్నాయి.

Professor Hara Gopal On Nepal Crises | India | Telugu Rajam