(గోసాల ప్రసాద్)
వైఎస్ ఆర్ సిపి అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కత్తి దాడి తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించింది. 1984లో హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన ఏడాది ఉత్సావాల్లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీ అనే యువకుడు చేసిన దాడి సంఘటన మళ్ళీ నిన్న అందరి మస్తిష్కాలలోను తిరుగాడింది. అయితే రెండింటి మధ్య చాలా తేడా కనిపిస్తుంది.
![]()
ఆ నాటి సభలో ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు, నాదెండ్ల భాస్కర్ రావు, ఇతర ప్రభుత్వ పెద్దలు, సీనియర్ అధికారులు ఉన్నారు. అంతలోనే ఒక యువకుడు మెరుపులా వచ్చి (రాష్ట్ర పోలీసుల అదీనంలో ఉన్న విఐసి ఎన్ క్లోజర్ లోకి ఎలా వచ్చాడు?) ఎన్టీరామారావు మీద దాడి చేశాడు. దాడిని ఆయన తప్పించుకున్నాడు. చివరకు ఆయన బొటనవేలుకు గాయమయింది.
ఎన్టీయార్ మీద దాడి చేసిన వ్యక్తి మల్లెల బాబ్జీ అని, అతగాడు గుంటూరు జిల్లాకు చెందిన వాడని పోలీసులు తెలుసుకున్నారు. దాడి తగిలాక అసుపత్రికి వెళ్లకుండా ఆయన ఇంటికి వెళ్లారు. బొటనవేలికి నిమ్మకాయ తగిలించుకుని వచ్చి ప్రదర్శనకు ఉంచడం మొదలుపెట్టారని దాడి సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఉన్న ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావు తన జ్ఞాపకాలులో రాశారు. తర్వాత ఆయన కట్టు కట్టించుకుని ఎవరొచ్చినా బొటనవేలు అందరికి కనపడేట్లు ఇలా (పై ఫోటో) ప్రదర్శించేవారు. మల్లెల బాబ్జీ జీవితం విషాదంగా ముగిసింది. అయితే, ఎన్టీఆర్ కు మాత్రం ఎంతో సానుభూతి తెచ్చిపెట్టింది.
ముఖ్యమంత్రి పై దాడి చేసి బొటన వేలుకు గాయం చేసిన కేసు చాలా కాలం కోర్టులలో నానింది. జస్టిస్ శ్రీరాములు కమిషన్ కూడా ఈ కేసును విచారించింది. విచిత్రమైమింటే- ఎన్టీఆర్ పై దాడికి పాల్పడిన మల్లెల బాబ్జీ గుంటూరులో ఒక లాడ్జిలో కొంత కాలం తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆత్మహత్య కాదని హత్య అని జస్టిస్ శ్రీరాములు కమిషన్ తేల్చింది. ఇది దాడి కాదని, పబ్లిషిటీ కోసమే ఎన్టీరామారావు ఈ దాడి చేయించుకున్నారని, బాబ్జీ దగ్గిర ఉన్నది కేవలం చిన్న పెన్ నైఫ్ మాత్రమే నని జస్టిస్ రాములు పేర్కొన్నారు. ఈ దాడి జిమ్మిక్ అని తన నివేదికలో రాశారు. ఈ రిపోర్టును ఎన్టీ రామాారావు లెక్క చేయలేదు. ఆ నివేదిక లోని అంశాల మీద నాటి ఇండియా టుడే ఏమి రాసిందో చూడండి.

ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుపై అలిపిరి వద్ద మావోస్టులు జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో చంద్రబాబు ప్రాణాలతో బ్రతికి బయటపడ్డా ఆయన ఆశించిన రీతిలో సానుభూతి పవనాలు రాలేదు సరికదా ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకు జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వం పరాజయం పాలైంది.
నిన్న విశాఖ ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ పై శ్రీనివాస రావు అనే యువకుడు చేసిన కత్తి దాడితో పాత విషయాలు స్ఫురణకు రావడం సహజం. ఈ దాడిలో స్వల్పంగా గాయపడిన జగన్ కు బోల్డంత సానుభూ తి లభించింది. అన్ని వర్గాల వారు ఈ సంఘటన పట్ల విస్మయం చెందారు. ఎందుకంటే దాడి జరిగిన తీరు, సందర్భం అలాంటిది. జగన్ పాపులారిటీ పైపైకి పోతూ ఉంది.ఆయన ప్రజాసంకల్పయాత్ర నిరాటంకంగా సాగుతూ ఉంది. ఎక్కడా తాను అలసిపోయినట్లు జగన్ సూచన ప్రాయంగా కూడా చెప్పడం లేదు.
ఇప్పటికే 3220 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేస్తున్న జగన్ కు కొత్తగా సరికొత్త ప్రచారం అవసరం లేదు.
అయితే, జగన్ కు ప్రచారం తెప్పించడానికే శ్రీనివాస రావు ఈ దాడికి పాల్పడ్డాడని ఎటువంటి దర్యాప్తు చేయకుండానే ఆంధ్రప్రదేశ్ డిజిపి ఠాకూర్ ప్రకటించడం ఆశ్చర్యం. ఆయన ప్రకటన రాజకీయ విమర్శలకు దారి తీసింది. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పై జరిగిన దాడి ఏదోరకంగా జగన్ కు అనుకూలంగా మారిపోతుందోనన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో కనిపించింది. ఏకంగా మంత్రులు సీనియర్ నాయకుడు పుంఖాను పుంఖంగా ప్రకటనలు కుప్పించారు. ఈ ప్రకటనల్లో కన్ ఫ్యూజన్ కూడా దట్టంగా ఉంది. మొదట జగన్ కు సానుభూతి చెప్పడం, తర్వాత ఇది నాటకం అనడం ఈ ప్రకటనల్లో కనిపిస్తుంది. ఎన్టీయర్ మీద జరిగిన దాడి డ్రామా అని తేెలింది. చంద్రబాబు మీద జరిగిన దాడి సానుభూతి తేలేదు. జగన్ మీద జరిగిన దాడి కూడా అలాగే ఫిజులవుట్ కావాలి అనే అందోళన వాళ్లలో కనిపిస్తుంది. ఎందుకొచ్చిందీ ఆందోళన ?
సాయంకాలానికి దాడి నిజంగా జరిగిందేమో అనే అనుమానాలు బలపడ్డాయి వారిలో.
గవర్నర్, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ , కవిత, కేటిఆర్ , తదితరులు జగన్ పై సానుభూతి ప్రదర్శించడాన్నిజీర్ణించుకోలేక కేంద్రం కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రానికి మాట మార్చి కొత్త పల్లవి అందుకున్నారు.

విచిత్రం ఏమిటంటే- చంద్రబాబుపై అలిపిరిలో బాంబు దాడి జరిగిన కొద్ది గంటలకే అప్పటి ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి తిరుపతి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబును పరామర్శించారు. అయితే, ఈ దాడి వెనక రాజశేఖర్ రెడ్డి హస్తముందని కూడా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇప్పటికే విశ్వసిస్తూనే ఉన్నారు. ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఇదే విషయం చెప్పారు. అంత చేసినా ఆరోజుల్లో చంద్రబాబు నాయుడికి ఎందుకో పెద్దగా సానుభూతి రాలేదు.
ఇప్పుడు జరిగిన సంఘటనలో రాజకీయ కోణం వెతుకున్న చంద్రబాబు కనీసం ఫోన్లో నైనా జగన్ ను పరామర్శించి ఉంటే-బాబు కోరుకున్న మీడియా మైలేజ్ వచ్చేది.
సానుభూతి జగన్ కు దక్కింది. మరో ఆరేడు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరుగనున్న నేపధ్య ంలో జగన్ పై జరిగిన దాడి సానుభూతి పవనాలుగా మారిపోతుందేమోన న్న ఆందోళన తెలుగుదేశం అధినేతలో కన్పిస్తోంది.

