అధ్యక్ష పదవి నుండి కన్నాకు ఉద్వాసన పలికిన బీజేపీ 

Kanna Lakshmi Narayana
భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖలో భారీ మార్పులకు తెర లేపింది.  అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు ఉద్వాసన పలికి ఆ పదవిని సీనియర్ నేత సోము వీర్రాజుకు అప్పగించింది.  ఈమేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  పెద్దగా హడావుడి ఏమీ లేకుండానే జరిగిన ఈ మార్పుతో బీజేపీ రాష్ట్ర వర్గాలు సైతం కొంత ఆశ్చర్యానికి గురయ్యాయి.  నిజానికి తెలంగాణ బీజీపీ అధ్యక్షుడిని మార్చే సమయంలోనే ఏపీ అధ్యక్షుడిని కూడా మార్చాలని పార్టీ అధిష్టానం భావించినా ఎందుకో ఆ అంశాన్ని పెండింగ్లో పెట్టారు.  కానీ ఈమధ్య కన్నా లక్ష్మీనారాయణ తీరు పార్టీలోనే వివాదాస్పదం కావడంతో ఉన్నపళంగా ఈ చర్య తీసుకున్నారు. 
 
 
ఈమధ్య మూడు రాజధానుల విషయంలో కన్నా గవర్నర్ గారికి రాసిన లేఖ పార్టీలోనే అభ్యంతరాలకు కారణమైంది.  ఆమరావతి విషయంలో కేంద్రం డబుల్ స్టాండ్ తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా స్పందించాలనే ఆలోచనలో ఉండగానే అమరావతికి మద్దతిస్తూ కన్నా లేఖ విడుదల చేశారు.  దానిపై సునీల్ దియోధర్ అభ్యంతర వ్యక్తం చేశారు.  అధిష్టానం కూడా సీరియస్ కావడంతో కన్నా మీద చర్యలు ఖాయమనే వార్తలు ఊపందుకున్నాయి.  కానీ ఎందుకో అధిష్టానం వెనక్కి తగ్గి ఆ చర్యలను నిలిపివేసినట్టు కనబడింది. 
 
 
కానీ ఉన్నట్టుండి ఈరోజు సోము వీర్రాజును పదవిలో నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి.  కన్నా పదవీకాలం ముగియడంతోనే పక్కనపెట్టారని, అయనకు త్వరలోనే కేంద్ర స్థాయిలో గుర్తింపు ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నా అమరావతికి రాసిన అనుకూల లేఖ వివాదం మూలాంగా, రాష్ట్రంలో పార్టీ స్థితి గతుల్లో పురోగతి లేదన్న కారణాలతోనే ఆయన్ను తప్పించారనే వాదన నడుస్తోంది.  ఇక సోము వీర్రాజు విషయానికి వస్తే ప్రస్తుతం మండలి సభ్యుడిగా ఉన్న వీర్రాజుకు వీర విధేయుడిగా పేరుంది.  ఆ పేరే ఈరోజు ఆయన్ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టింది.