‘వకీల్సాబ్’ సినిమా మీదున్న శ్రద్ధ పవన్ కళ్యాణ్కి తాను స్థాపించిన జనసేన పార్టీ మీద లేదా.? ఎప్పుడూ ఏదో ఒక పార్టీ మీద చేరబడిపోయి, రాజకీయాన్ని చేయడం తప్ప, తనంతట తానుగా రాజకీయం చేసేంత ఓపిక ఆయనకు లేదా.? వుంటే, తిరుపతి ఉప ఎన్నికల కోసం జనసేన పార్టీ ఎందుకంత శ్రద్ధ పెట్టడంలేదు.! జనసైనికుల్లోనూ కొందరిలో ఇవే తరహా ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. మిత్రపక్షం బీజేపీ, గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో జనసేన పార్టీకి వెన్నపోటు పొడిచిన విషయం విదితమే. కానీ, జనసేనాని సర్దుకు పోయారు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బీజేపీ రాజకీయం ఎలా వుంటుందో పవన్ ఊమించుకోలేకపోతున్నారు. నిజానికి, తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ కంటే కాస్త బెటర్ పొజిషన్లో జనసేన వుంది. కానీ, ఇక్కడ పోటీ చేయాలనుకుంటోంది బీజేపీ. మిత్రపక్షం జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థి బరిలో వుంటారంటూ ఇప్పటికే బీజేపీ ప్రకటించేసింది. ‘తూచ్, మేమంతా చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని గతంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానంతో చర్చించారు. వాస్తవానికి, బీజేపీ అధిష్టానం, పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చి, తిరుపతి ఉప ఎన్నిక విషయమై చర్చించాలి. కానీ, అందుకు భిన్నంగా జరిగింది వ్యవహారం. బీజేపీని గెలిపించేందుకు తగిన రీతిలో సహకరించడం తప్ప, జనసేన పార్టీకి ఇంకో ఎజెండానే లేకుండా చేయాలన్నది కమలనాథుల ఆలోచనగా కనిపిస్తోంది.
చిత్రంగా ఆ వ్యూహానికి జనసేనాని క్లీన్ బౌల్డ్ కూడా అయిపోయారు. ఇదే జనసైనికులు జీర్ణించుకోలేని అంశంగా మారిపోతోంది. ‘అబ్బే, అలాంటిదేమీ లేదు..’ అని బీజేపీ నేతలు కొందరు బుకాయిస్తున్నా, వాస్తవ పరిస్థితి ఏంటన్నది జనసేన నాయకులకూ అర్థమవుతోంది. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అవసరమైనంత సమయం జనసేన పార్టీకి దొరికింది. నాయకుల్ని అప్రమత్తం చేసి, పార్టీని బలోపేతం చేస్తే.. బీజేపీకి, జనసేనను బలపర్చడం తప్ప ఇంకో అవకాశమే వుండేది కాదు. కానీ, ఆ తరహా వ్యూహం రచించడంలో జనసేనాని విఫలమయ్యారు. రాజకీయాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలే ఏ రాజకీయ పార్టీకి అయినా అడ్వాంటేజ్ కలిగిస్తాయి. దురదృష్టవశాత్తూ ఆ వ్యూహాలు జనసేనానిలో కొరవడుతున్నాయి.