అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులపై వీసా సమస్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయాలతో వందల మంది అంతర్జాతీయ విద్యార్థుల చదువు సందిగ్ధంలో పడింది. వారిలో సగం మంది భారతీయులే ఉండడం విశేషం. దీనితో విద్యార్థులు తమ భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (AILA) తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 327 మందికి వీసాలు రద్దయ్యాయి. అలాగే వారి స్టూడెంట్ రికార్డులను నిలిపివేయడంతో విద్యాసంస్థలు చింతనలో పడ్డాయి. వీరిలో 14 శాతం చైనా విద్యార్థులు కాగా, మిగతా వారు దక్షిణ కొరియా, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు చెందినవారు.
ఈ వ్యవహారంపై అమెరికాలోని పలు కోర్టులు విద్యార్థుల హక్కులను రక్షిస్తూ తాత్కాలిక ఆదేశాలు ఇచ్చాయి. విస్కాన్సిన్లో చదువుతున్న భారత విద్యార్థి క్రిష్ ఇస్సర్దాసానిపై అరెస్ట్ తర్వాత ఎస్ఈవీఐఎస్ రద్దు చేయడం న్యాయపరంగా తప్పని కోర్టు పేర్కొనడంతో మరింత కలకలం రేగింది. చిన్న గొడవతో ఎలాంటి స్పష్టత లేకుండా వీసా రద్దు చేయడం విద్యార్థుల మనోస్థితిని దెబ్బతీస్తోంది.
ఇలాంటి పరిణామాలు భారతీయ కుటుంబాలకు తీవ్రమైన మానసిక భారం కలిగిస్తున్నాయి. కోట్లు ఖర్చు చేసి చదువుకోనొచ్చిన పిల్లల భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న తల్లిదండ్రుల్లో భయం నింపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందిస్తేనే, అమెరికాలో ఉన్న విద్యార్థులకు ఊరట లభించవచ్చు. ఏఐఎల్ఏ సూచించినట్టు, వీసా వ్యవహారాల్లో పారదర్శకత లేకపోతే విద్యారంగంపై దుష్ఫలితాలు తప్పవన్నది స్పష్టమవుతోంది.