‘పార్లమెంటు చేసిన చట్టాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం సమర్థనీయం కాదు.. ఏ వ్యవస్థ గొప్పతనం ఆ వ్యవస్థదే.. శాసన వ్యవస్థనే శాసించాలని న్యాయస్థానాలు భావించడం అస్సలేమాత్రం మంచిది కాదు..’ అంటూ పలువురు రాజకీయ నాయకులు గత కొంతకాలంగా వ్యాఖ్యానిస్తున్నారు.. న్యాయవ్యవస్థపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు కూడా కొందరు చేస్తున్నారు. అయితే, న్యాయ వ్యవస్థ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం కావొచ్చు.. జాతీయ స్థాయిలో కొత్త వ్యవసాయ చట్టాలు కావొచ్చు.. న్యాయస్థానాల జోక్యంతో ఆగిపోయాయి. ఆంధ్రపదేశ్లో వైఎస్ జగన్ సర్కార్, న్యాయ స్థనాల నుంచి షాకుల మీద షాకులు తినేస్తోన్న విషయం విదితమే. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు, న్యాయ వ్యవస్థపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే, కొన్ని సందర్భాల్లో న్యాయ స్థానాల తీర్పులూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వీటిల్లో గ్యాగ్ ఆర్డర్స్ వ్యవహారం కూడా ఒకటి. అయితే, న్యాయస్థానాల తీర్పుల్ని, న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం వుంది గనుక, ఆయా తీర్పుల్ని బట్టి, వ్యవస్థ మీద అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. ఇక, వ్యవసాయ చట్టాల విషయానికొస్తే.. కేంద్రం ఏదేదో చెబుతోంది.. రైతుల్ని ఉద్ధరించేస్తామంటోంది. కానీ, ‘మమ్మల్ని ఇలా బతకనీయండి మహాప్రభో.. ఉద్ధరించేయాల్సిన అవసరం లేదు..’ అంటూ కొందరు రైతులు బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు.
వివాదం ముదిరి పాకాన పడిన దరిమిలా, న్యాయస్థానం ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. కమిటీ వేసి.. ఇరు పక్షాల వాదనలూ వింటామని, పరిష్కారం సూచిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ క్రమంలో వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. శాసన వ్యవస్థ తనకు బలం వుంది కదా.. అని, ఆ బలాన్ని జనం మీద బలవంతంగా రుద్దితే, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. ఏపీ సర్కారు విషయంలో అయినా, మోడీ సర్కారు విషయంలో అయినా న్యాయస్థానాల జోక్యం.. ఆయా పరిస్థితుల ఆధారంగానేనని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలన్నది న్యాయ నిపుణుల వాదన.