India – United Kingdom: ఉగ్రవాదాన్నీ దెబ్బ కొట్టేలా… భారత్-యూకే కీలక చర్చలు

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్న వేళ, భారత్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, యూకే విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ తో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఉగ్రవాదం నిర్మూలనకు సంబంధించి ఇరుదేశాలు కలసి పనిచేయాల్సిన అవసరాన్ని ప్రధానంగా చర్చించినట్లు జైశంకర్ ప్రకటించారు. “ఉగ్రవాదానికి ఏ స్థితిలోనూ తావు ఇవ్వకూడదు. దీన్ని ఎదుర్కొనే విషయంలో మనం వెనక్కి తగ్గం” అని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.

పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, ఆ తర్వాత భారత్ చేపట్టిన ప్రతీకార దాడులు.. వీటితో ఉగ్రవాదం వ్యతిరేక పోరాటం మళ్లీ అంతర్జాతీయ దృష్టిలోకి వచ్చింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్ పీఓకే, పాకిస్థాన్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన సంగతి తెలిసిందే. మొత్తం తొమ్మిది శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేశారు.

ఈ దాడుల తర్వాత పాక్ సైన్యం ఎల్ఓసీ వెంబడి డ్రోన్ల దాడులు, సైనిక కాల్పులు జరుపుతున్నా, భారత్ దీటుగా సమాధానం ఇస్తోంది. ఈ క్రమంలో జైశంకర్-డేవిడ్ లామీ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉగ్రవాదం మీద గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యూకే వంటి దేశాల మద్దతు, అంతర్జాతీయ సమన్వయం భారత్‌కు మరింత బలం కల్పిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ పరిణామాలు భారత్ ఉగ్రవాదానికి ఎదురుగా మరోసారి గట్టి సంకేతాలు పంపిస్తున్నాయి. జైశంకర్, లామీ మధ్య కొనసాగిన చర్చలు భవిష్యత్తులో ఉగ్రవాద నిర్మూలనకు పటిష్ఠ వ్యూహాలకు దారితీస్తాయా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. దేశ భద్రతను సమర్థంగా కాపాడేందుకు భారత్ అన్ని రంగాల్లో మద్దతు సమీకరిస్తోంది.

మీసం మెలేసిన భారత సైన్యం || Analyst Ks Prasad Aggressively Reacts On India Pakistan War || TR