భారత్, పాకిస్తాన్ మధ్య వారం రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని సమాచారం. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి భూ, గగన, సముద్ర సరిహద్దులపై అన్ని తాత్కాలిక దాడులు నిలిపివేయనున్నట్లు తెలిపారు.
ఈ ఒప్పందం కుదిరిన తర్వాత ఈ నెల 12న పాకిస్థాన్ విదేశాంగ శాఖతో అధికారిక చర్చలు జరపడానికి భారత్ సిద్ధంగా ఉందని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు డైరెక్టర్ల జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) స్థాయిలో ఫోన్ సంభాషణ జరగడం ద్వారా ఈ ప్రక్రియలో ముందడుగు పడిందని వివరించారు. పాక్ మంత్రి ఇషాక్ దర్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.
మిగతా కాల్పులు నిలిచినప్పటికీ, సరిహద్దుల్లోని ప్రజలకు ఇది పెద్ద ఊరటగా మారింది. రాజస్థాన్, పంజాబ్, జమ్మూకశ్మీర్లోని గ్రామాల్లో భయబ్రాంతులకు గురైన స్థానికులు చివరకు శ్వాస తీసుకోవడానికి అవకాశం దొరికిందని చెబుతున్నారు. ఇంతకాలం రాత్రి వేళ బాంబుల శబ్దాలు, సైనిక కదలికలతో వణికిన ప్రజలు, ఈ ఒప్పందంతో కొంతవరకు ఊరట పొందినట్టయ్యారు.
అయితే, రక్షణ నిపుణులు మాత్రం ఈ ఒప్పందంపై పూర్తి విశ్వాసంతో లేరని తెలుస్తోంది. ఇది తాత్కాలిక విరమణ మాత్రమేనని, పరిస్థితులు ఎప్పుడు తిరిగి ఉద్రిక్తతకు దారితీయవచ్చో చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు. ఇరుదేశాల మధ్య ఉన్న అనేక సమస్యలు పరిష్కారానికి రాలేదని, చర్చల ద్వారా పటిష్టమైన పరిష్కారం రావాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతానికి భారత్, పాక్ మధ్య సాధ్యమైనంతకాలం శాంతి కొనసాగుతుందని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. కానీ ఈ ఒప్పందం వాస్తవంగా ఎంతకాలం నిలిచేది? అది కాలం తేల్చాల్సిన అంశం.