కెసియార్ రాజకీయ యాత్రల రహస్య అజండా ఏమిటి?

ప్రధాని మంత్రుల రేసులో ఆరు మంది నేతలున్నారు. జాతీయ పార్టీ లేకుండా సంకీర్ణం సాధ్యమా. అయితే గియితే ఛాన్స్ చూద్దామని  కెసిఆర్ దేశాటన బయలు దేరినట్లున్నారు.

 

(వి. శంకరయ్య 9848394013)

 

భారత దేశంలో కాంగ్రెస్ రాజకీయ గుత్తాధిపత్యం ముగిసిన తదుపరి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు లేకుండా ఏర్పాటు జరగ లేదు.

ఇది చరిత్ర చెప్పే పాఠం. ఈ రోజు కెసిఆర్ గాని ప్రధాని పదవి ఆశిస్తున్న ములాయం లేదా మాయావతి కాకుంటే మమత బెనర్జీ ఎవరైనా సరే పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అంతిమంగా కాలం కలసి వస్తే రెండు జాతీయ పార్టీలో దేనికో ఒక దాని చేతిలో తురుపు ముక్క గా రూపొంది ప్రధాని పదవి పొంద వలసినదే. లేదా రెండు జాతీయ పార్టీలలో దేనికైనా ఉప కరణంగా వుండి బయట వుండి సపోర్టు చేయడం లేదా కూటమిలో కలసి పోవలసినదే. పేరు ఏది పెట్టుకున్నా మూడవ ఫ్రంట్ అనేది ప్రధాని పదవి సాధనకు ఒక ముసుగు మాత్రమే.

ఈ దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు జాతీయ పార్టీలను పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ లేదు.  ఇక ముందు వుండబోదు. ఎందుకంటే దేశంలో రెండు జాతీయ పార్టీలు బలంగా మొహరించి వున్న రాజకీయ నేపథ్యం అలాంటిది. అంతేకాదు. కెసిఆర్ లాగా మూడవ ఫ్రంట్ అంటూ భావించే ప్రాంతీయ పార్టీ నేత మరొకరు లేక పోవడం గమనార్హం.  మరి కెసిఆర్ ఇంత తాపత్రయం ఎందుకు పడుతున్నారు? రాజకీయం అంటే ఇదే. పరమ పద సోపానంలో పైకి ఎగ బాకేందుకు ఎన్నో నిచ్చెనలు వున్నట్లు తన దైన శైలిలో కెసిఆర్ ఈ మార్గం ఎన్నుకున్నారు.

మళ్లీ ప్రధాని మీరే, కాదంటే నేనే…

తెలంగాణ  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి గరిపించిన తర్వాత కూడా కెసిఆర్ కలుసు కున్న నేతలు ఎవరూ కాంగ్రెస్- బిజెపి యేతర కూటమి గురించి పల్లెతు మాట మాట్లాడలేదు. కెసిఆర్ చెప్పింది విన్నారు. నవీన్ గాని మమత బెనర్జీ గాని కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలను బలపరుస్తూ పలుకు పలకలేదు.

అయితే ఒక్క అంశం మాత్రం నిజం. భవిష్యత్తులో కెసిఆర్ ఏ టర్న్ తీసుకుంటారో ఏమో గాని ఇప్పటి వరకు తను నమ్మిన సిద్ధాంతం పై గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బలంగా వాదన వినిపించుతున్నారు. అంత మాత్రానే ఇంత విశాలమైన దేశంలో ఇన్ని రాష్ట్రాలు వున్న దేశంలో గతంలో అనుభవానికి రాకుండా ప్రస్తుతం ఎవరూ బలపరచని విధానాన్ని కెసిఆర్ విజయవంతంగా అమలు చేయ గలరని నమ్మడం ఎలా? అంత మాత్రాన కెసిఆర్ ను తక్కువ అంచనా వేయలేము. 

సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత వివిధ రాష్ట్రాలలో గెలుపొందే ప్రాంతీయ పార్టీల బలాబలాలను బట్టి రాజకీయాలు ప్రాధాన్యత వహించుతాయి.పైగా నూతన రాజకీయ పరిస్థితిలో రెండు జాతీయ పార్టీలు నువ్వా నేనా అనే ధోరణిలో మొహరించితే ఒక్కటి మాత్రం నిజం. కాంగ్రెస్ కూటమి ని గాని లేదా కాంగ్రెస్ బలపరిచే ప్రాంతీయ నేత ప్రధాని పదవి చేపట్టే కూటమికి గాని కెసిఆర్ సహకరించే అవకాశం లేదు. తదుపరి ఏంజరిగేది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ వాసనలు లేని ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు జరగాలని కెసిఆర్ అన్నింటికి తెగించితే బిజెపి ఛాయలు లేని ప్రభుత్వం కోసం చంద్రబాబు ఎంతటి త్యాగానికైనా సిద్ధ పడతారు.

అది కాకుండా డిసెంబర్ 10 వతేది జరిగిన సమావేశంలో అఖిలేశ్ మాయావతి పాల్గొనలేదు. రేపు యుపిలో కాంగ్రెస్ ను కడగాటన కట్టాలనేది వీరిద్దరి వ్యూహంగావుంది. అదే నిజమైతే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా వారు అంగీకరించరు.అంటే చంద్రబాబు చేస్తున్న కూటమి యత్నాలకు వీరిద్దరు గండి కొట్టి నట్లే. యుపి ఎన్నికల ఫలితాల్లో అఖిలేశ్ మాయావతి బంపర్ కొట్టారంటే అదీ కాంగ్రెస్ ను పక్కన బెట్టి బిజెపి పై విజయం సాధించితే దేశ రాజకీయాల్లో నూతన మలుపు వస్తుంది. కెసిఆర్ చంద్రబాబు ప్రేక్షక పాత్ర వహించాలసినదే.

ఇదిలా వుండగా నవీన్ కాంగ్రెస్ కు బిజెపి కి సమాన దూరం పాటిస్తునారు. అంటే ఎన్నికల తర్వాతనే నవీన్ వైఖరి వెల్లడౌతుంది. మమత వైఖరి కూడా ఇదే విధంగా వుండటమే కాకుండా పైగా ఛాన్స్ లభిస్తే ప్రధాన మంత్రి పదవికి పోటీ పడతారు. ఈ స్థితిలో ప్రధాన మంత్రి పదవి పై కన్నేసి దేశాటన గావించే కెసిఆర్ ప్రయత్నాలకు మమత బహిరంగంగా మద్దతు పలుకు తారని ఏలా భావించ గలం. ఇదిలా వుండగా పైకి అఖిలేశ్ ఏం చెప్పినా కెసిఆర్ ను కలుసు కోకపోవడం గమనంలోనికి తీసుకోవాలి.

మరో వేపు కెసిఆర్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసే కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకు పడుతున్నారు. చంద్రబాబు చెబుతున్నటు మూడవ ఫ్రంట్ ఒక భ్రాంతిగా ఎంత వాస్తవమో ఈ నాలుగేళ్ల కాలంలో పలు మాటలు మార్చి రాజకీయ యవనిక పై చంద్రబాబు అభాసు పాలు కావడం అంతే వాస్తవం. రాజకీయాల్లో ప్రత్యర్థులు వుంటారు గాని శత్రువులు వుండ కూడదనే వాస్తవాన్ని చంద్రబాబు మరచి పోయి ప్రధాని మోడీ కెసిఆర్ పై అతిగా వ్యవహరించడం మరో విశేషం. ఈ వైఖరి ఇప్పుడు గాని మున్ముందు గాని టిడిపి కి ఒక రాజకీయ పార్టీ గా జరిగే నష్టం పక్కన బెడితే ఎపి ముఖ్యమంత్రి గా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీవ్ర అపకారం చేస్తున్నారు.

టిడిపిలో చంద్రబాబుకు సలహా ఇచ్చే వారు లేక పోవడం దురదృష్టకరం. ఈ లోపు కెసిఆర్ ప్రధానిని కలవడంపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు. అసలు మోడీని ఒక దేశ ప్రధానిగా చంద్రబాబు గుర్తించక పోవడం తీవ్ర మైన తప్పిదం. 23 మంది వైసిపి ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులను చేయించిన చంద్రబాబును కూడా విపక్ష నేత జగన్ ఒక ముఖ్య మంత్రిగా ఎందుకు గుర్తించాలి? ఢిల్లీ లో కెసిఆర్ ప్రధానిని కలిశారు. ఇద్దరు నేతలు ఏ కాంతంగా కలసిన సందర్భంలో ఎన్నో అంశాలు చర్చకు వస్తాయి. వాటిపై ఈకలు పీకడం ఎవరికి తగదు. ఎవరి రాజకీయం వారిది.

ఇంత గజి బిజి రాజకీయ వాతావరణంలో గమనార్హమైన అంశ మేమంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే వివిధ రాష్ట్రాలు తిరుగు తున్నారు. తిరిగి కేంద్రంలో బిజెపి కూటమి అధికారంలోకి వస్తే ఒక వేళ తను రాష్ట్రంలో అధికారంలోని కొచ్చినా అంతా అడవిని కాచిన వెన్నెల అవుతుందని చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని తిరుగు తున్నారు. అదే విధంగా కేంద్రంలో కాంగ్రెస్ కూటమి గాని లేదా కాంగ్రెస్ బలపరిచే ప్రాంతీయ పార్టీ నేత గాని ప్రధాని పదవి చేపడితే తిప్పలు తప్పవని దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీ నేతలతో ఒక్కరిని కూడా వదల కుండా కెసిఆర్ కలుసుకుంటూ మంచి చేసు కుంటున్నారు.

ప్రధాని పదవి ఆశించడం లేదా ప్రధాని ఛాన్స్ వుండే ప్రతి వారిని వదలి పెట్టడం లేదు. అదే సమయంలో చంద్రబాబు కూడా రాహుల్ గాంధీ గాని కాంగ్రెస్ అండతో ప్రధాన మంత్రి పదవి ఎవ్వరు పొందినా ఫర్వా లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారు. పాపం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకే తిప్పలు వచ్చాయి. దేశంలో ఇంకా పలువురు ముఖ్యమంత్రులు వున్నా ఒక్కరు ఇంటి నుండి కాలు కదపడం లేదు. తుదకు రాహుల్ కూడా నిమ్మళంగా వుండగా అందరి బాధ తన బాధగా చంద్రబాబు భుజాన వేసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు ఈ తల పోటు తప్పక పోవడం పూర్వ జన్మ ఏ ఫలమో. చేసుకున్న అమ్మకు చేసుకున్నంత. కలికాలం ఏంచేదాం? .

((వి. శంకరయ్య, రాజకీయ విశ్లేషకుడు, ఫోన్ నెం. 9848394013)