12 వేల ఇళ్ళు.. పూర్తయితే జగన్‌కి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే

Hatsoff to Jagan if 12 thousand houses are completed

రాష్ట్రంలోనే పేదల కోసం ప్రభుత్వం అతి పెద్ద లే అవుట్‌ని పేద ప్రజల కోసం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు ఇళ్ళ పట్టాల్ని అందించారు. అత్యద్భుతమైన డ్రైనేజ్‌ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం, రవాణాకు వీలుగా ఏర్పాట్లు.. ఇలా ఒకటేమిటి.? ఓ టౌన్‌ షిప్‌ తరహాలో ఈ ‘మినీ నగర పంచాయితీ’ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెబుతున్నదాన్నిబట్టి, ఈ నగర పంచాయితీ పరిధిలో సుమారు 50 వేల మంది ప్రజానీకం నివసించేందుకు ఆస్కారం వుంది. ఇది గనుక అభివృద్ధి చెందితే, చుట్టుపక్కల ప్రాంతాలకూ అది విస్తరిస్తుంది. విలేజ్‌ మాల్స్‌ సహా అన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారట. వాకింగ్‌ ట్రాక్‌, పార్క్‌ వంటివీ వుంటాయట. వినడానికే ఎంత అత్యద్భుతంగా వుందో కదా.! నిజానికి, ఓ చిన్నపాటి నగరాన్ని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పేదల కోసం నిర్మిస్తోందన్నమాట. ఈ ప్రాజెక్టు గనుక కార్యరూపం దాల్చితే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి హేట్సాఫ్‌ చెప్పాల్సిందే.

Hatsoff to Jagan if 12 thousand houses are completed
Hatsoff to Jagan if 12 thousand houses are completed

ఎందుకంటే, పేదలకు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు అనగానే కనీస మౌళిక సదుపాయాల్లేని ప్రాంతాలే పాలకులకు గుర్తుకొచ్చేవి. కానీ, ఇప్పుడు వైఎస్‌ జగన్‌ సర్కార్‌, ఆ చెడ్డ పేరుని చెరిపేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓ యజ్ఞంలా ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ‘మేం నిర్మిస్తున్నది ఇళ్ళు కాదు, ఊళ్ళు..’ అంటూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇది దేశంలోనే కనీ వినీ ఎరుగని అతి గొప్ప సంక్షేమ కార్యక్రమం.. అదే సమయంలో, ఇది అంత ఆషామాషీ వ్యవహారం కూడా కాదు. ఏడాదిలోనో, రెండేళ్ళలోనో, మూడేళ్ళలోనో డెడ్‌లైన్‌ పెట్టేసి, ప్రాజెక్టు పూర్తి చేసేస్తామంటే, పరిస్థితులు అంతగా అనుకూలిస్తాయని అనుకోలేం. రాష్ట్రం ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో.. ఇంత పెద్ద ప్రాజెక్టులు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారతాయి. మరి, ఏ ధైర్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.? అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ఇళ్ళు, ఊళ్ళ నిర్మాణం జరగకపోతే మాత్రం.. అది జగన్‌ సర్కార్‌కి రాజకీయంగా చాలా చాలా చెడ్డపేరు తెచ్చే ప్రమాదం లేకపోలేదు.