AP Budget: ఆర్థిక ప్రణాళికలో కొత్త కోణాలు.. ఏపీ బడ్జెట్‌పై ఆసక్తి

ఏపీ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కొన్ని ప్రత్యేక మార్పులు చేస్తూ, కొత్త పథకాలకు నిధులు కేటాయించింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాల సాయంతో మరింత స్థిరత తీసుకురావాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య, భాషాభివృద్ధి, విద్యుత్ వినియోగంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఖర్చులను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 92,000 పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు సూర్యఘర్ యోజన పథకాన్ని అనుసంధానం చేయనున్నారు. ఈ నిర్ణయం విద్యా సంస్థలకు ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, పునరుత్పాదక విద్యుత్ వాడకాన్ని పెంచేలా ఉంటుంది.

ఇక రాష్ట్రంలో తొలిసారి భాషాభివృద్ధికి నిధులు కేటాయించడం మరో విశేషం. తెలుగు భాషాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేస్తూ, తెలుగు మీడియాన్ని తిరిగి ప్రోత్సహించడమే కాకుండా, ఇంగ్లీషు విద్యా విధానాన్ని సమాంతరంగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. భాషా పరిరక్షణతో పాటు, మారుతున్న ప్రపంచ పరిస్థితులకు తగిన విధంగా విద్యా విధానాన్ని సమతూకంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నిర్ణయాలు అమలు అయితే, విద్యా రంగానికి ఆర్థికంగా ఊతమిచ్చే విధంగా ఉంటాయి. అయితే, ఉచిత విద్యుత్ విధానం, భాషాభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఎంతవరకు సమర్థంగా ఉపయోగపడతాయన్నది చూడాలి. మరోవైపు, కొత్త పథకాలతోనే కాకుండా, ఇప్పటికే ఉన్న పథకాలకు మరింత బలం చేకూర్చేలా బడ్జెట్ రూపకల్పన చేయడమే కీలకంగా మారింది.

జగన్ అంటే అభిమానం || Kanumuri Ravi Chandra Reddy Great Words About Ys Jagan || Telugu Rajyam