Peethala Sujatha: “పులివెందుల నుండి అమరావతికి ఉచితంగా రండి: వైఎస్ భారతికి టీడీపీ నేత సవాల్”

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విధానం మహిళలను అభివృద్ధి పథంలో నడిపించడమేనని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఛైర్‌పర్సన్, మాజీ మంత్రి పీతల సుజాత ఉద్ఘాటించారు. మహిళల కోసం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా వైఎస్ భారతి కూడా పులివెందుల నుండి అమరావతికి ఉచితంగా ప్రయాణించవచ్చని ఆమె వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ మహిళా హక్కుల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ఆ స్ఫూర్తితోనే చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు బీజం వేశారని సుజాత గుర్తుచేశారు. నేడు కోటి మంది మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని ఆమె కొనియాడారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

‘స్త్రీ శక్తి’ పథకాన్ని మహిళలకు ముఖ్యమంత్రి ఇచ్చిన గొప్ప కానుకగా అభివర్ణించిన సుజాత, ఈ పథకాన్ని రాఖీ పండుగలా మహిళలు చిరకాలం గుర్తుంచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ పథకంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేతలు విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ‘సూపర్ సిక్స్’ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని సుజాత తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలా కాకుండా, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేశామని ఆమె వివరించారు. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అభివృద్ధికి వేల కోట్లు కేటాయించామని, రానున్న నాలుగేళ్లలో మరిన్ని పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తామని సుజాత ధీమా వ్యక్తం చేశారు.

ఫ్రీ బస్సు మాయ || Analyst Ks Prasad EXPOSED AP Free Bus Scheme Scam || Chandrababu || Telugu Rajyam