ఎర్రకోట వద్ద ఖాళీ కుర్చీ… దేశానికి పంపిన సందేశం ఇదే!

యావత్తు భారతావని 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో ప్రధానితోపాటు… సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమయంలో రిజర్వ్ చేసిన ఒక ఖాళీ కుర్చీ దర్శనమిచ్చింది.

ఎర్రకోటపై మోడీ ప్రసంగిస్తోన్న సమయంలో ప్రధానంగా రిజర్వ్ చేసిన ఒక సీటు ఖాళీగా కనిపించింది. అయితే… అది ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేది కావడం గమనార్హం. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దూరంగా ఉన్నారు. దీంతో ఆయన కోసం వేసిన కుర్చీ ఖాళీగా ఉంది.

అయితే అనారోగ్యం కారణంగా తాను హాజరుకాలేకపోయినట్టు ఖర్గే వివరణ ఇచ్చారు. అనంతరం కీలక అంశాలను ప్రస్థావిస్తూ ఒక వీడియో సందేశం పంపించారు. ఈ సందర్భంగా… భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక భూమిక పోషించిన మహాత్మా గాంధీ, జవహర్‌ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలాజా అబుల్ కలామ్ ఆజాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహాత్ములకు నివాళులర్పించారు.

అనంతరం.. దేశ ప్రగతిలో స్వాతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ.. ఇతర కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లతోపాటు బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిల పాత్రను మల్లిఖార్జున ఖర్గే కొనియాడారు. ఈ సమయంలో ప్రధాని మోడీపై సెటైర్స్ వేశారు.

ఈ సందర్భంగా… “ఇప్పటివరకూ దేశాన్ని పరిపాలించిన ప్రతి ప్రధానమంత్రి దేశ ప్రగతికి దోహదపడ్డారు.. అయితే, గత కొన్నేళ్లలోనే భారత్ పురోగమిస్తుందని ఈ రోజు చెప్పడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు” అని మోడీపై పరోక్షంగా సెటైర్స్ వేశారు. ఏ ఒక్కరివల్లో కాదని, అందరి సమిష్టి కృషి వల్ల దేశాభివృద్ధి సాధ్యం అయ్యిందని తెలిపారు.

ఇదే క్రమంలో ఈ రోజు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయని చెప్పడానికి చింతిస్తున్నట్లు చెప్పిన ఖర్గే… ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతుకను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు.. మైక్‌ లు కట్ చేస్తున్నారు.. ప్రసంగాలు తొలగిస్తున్నారు.. అని ఆరోపించారు.

ఇదే క్రమంలో… సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను (ఐటీ) అధికారుల దాడులే కాదు.. ఎన్నికల కమిషన్‌ ను కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. తమ నియంతృత్వ మార్గాలతో ప్రజాస్వామ్యాన్ని చీల్చుతున్నారని నిప్పులు చెరిగారు.