ప్రాణాలకన్నా ఎన్నికలు మిన్న 

కోవిద్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు భంగం కలిగించకూడదంటూ గోవా రాష్ట్ర ప్రభుత్వం మొన్న పద్దెనిమిదో తారీఖున ప్రకటించిన గెజిట్ ను తాత్కాలికంగా వాయిదా వేస్తూ స్థానిక ఎన్నికలను ఏప్రిల్ నెల తరువాత జరుపుతామని ప్రకటించి అరవై నిముషాలు కూడా గడవకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఎన్నికలు జరపాల్సిందే అంటూ కుండబద్దలు కొడుతూ తీర్పు ఇవ్వడం చాలామందికి దిగ్భ్రాంతి కలిగించి ఉంటుంది.  ప్రభుత్వ ఉద్దేశాలు ఎలాంటివైనా కానీ, వాక్సినేషన్ ప్రక్రియకు అంతరాయం కలుగుతుందని, రెండు నెలల తరువాత జరుపుతామని ప్రభుత్వం అభ్యర్ధించినా, ఉద్యోగసంఘాలవారు మొరపెట్టుకున్నా, వారి అభ్యర్థనలను ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రజలు బలైపోయినా సరే రాజ్యాంగ వ్యవస్థ పరువు బ్రతకాలి అన్నట్లు సుప్రీమ్ కోర్టు వ్యవహరించడం అత్యంత దారుణం.  పైగా ఎన్నిసార్లు వాయిదా వేస్తారు?, ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగంలో ఒక భాగం అని నీతులు వల్లించిన సుప్రీంకోర్టు 2018 లో ఆ రాజ్యాంగ ప్రక్రియను ఎందుకు పూర్తి చెయ్యలేదని ఎన్నికల కమీషనర్ ను నిలదీయకపోవడం మరింత విడ్డూరం.  ప్రభుత్వం భయపడుతున్నట్లు రేపు కరోనా కేసులు పెరిగితే ఎవరిని బాధ్యులను చేస్తారో గౌరవ నాయస్థానం నిర్ధారించకపోవడం ఆశర్యం.  “దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా” అని న్యాయస్థానం అధిక్షేపించడం బాగానే ఉంది..కానీ, వాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నపుడు ఎక్కడైనా ఎన్నికలు జరిగాయా అనే విషయాన్నీ తమ తీర్పులో ఉటంకించాల్సింది.  ఎన్నికల కమీషనర్ కు దురుద్దేశాలు ఆపాదిస్తారా అని సుప్రీం కోర్టు హుంకరించడం సరే, మరి ఆ ఎన్నికల కమీషనర్ మాజీ తెలుగుదేశం నాయకులను హైద్రాబాద్లో ఒక హోటల్లో కలవడం వెనుక దురుద్దేశ్యాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించలేదు.  
 
Elections are better than lives
Elections are better than lives
సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఎలా ఉన్నా శిరోధార్యమే కాబట్టి దాన్ని పాటించక తప్పదు.  ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు.  అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి.  ప్రభుత్వానికి ఈ తీర్పు వ్యతిరేకమే కావచ్చు కానీ తమ ఆరోగ్యం కోసం చివరివరకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడని, అలాగే తమ ప్రాణాలు పోయినా సరే ఎన్నికలు జరగాల్సిందే అంటూ ఎన్నికల కమీషనర్ భీష్మించడం వెనుక చంద్రబాబు హస్తం ఉన్నదని ప్రజలందరికి ఒక సందేశం వెళ్ళిపోయింది.  
 
ఇక ఇప్పుడు జరగబోయే ఎన్నికలు తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, జనసేనలకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఇచ్చాయి.  జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్మాద పాలన అని తెలుగుదేశం చేస్తున్న విమర్శలు ప్రజలు ఆమోదిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఈ ఎన్నికలు తేలుస్తాయి.  అలాగే కాంగ్రెస్, జనసేన, బీజేపీల బలం ఎంతవరకు పెరిగింది అనే సంగతి కూడా బహిర్గతం చేస్తాయి.  జగన్ మీద అనునిత్యం నిప్పులు చిమ్మే జనసేన ఎన్ని పంచాయితీలు దక్కించుకోగలదో చూడాలి.  గెలిచినవారంతా మావాళ్లే అని ఎవరు క్లెయిమ్ చేసుకున్నప్పటికీ వారు ఏ ఏ పార్టీలకు చెందినవారో ఆయా గ్రామాలవారికి తెలియకుండా ఉంటుందా?  పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగినా, గెలిచినవారు ఏ పార్టీ వారో అందరికి తెలుస్తుంది.  ఈ ఎన్నికల్లో వైసిపి ఎనభై శాతం పైగా సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీ బలం చెక్కుచెదరలేదని నిరూపితం అవుతుంది.  ఒకవేళ ఆశించినన్ని సీట్లు రాకపోతే తమ తప్పులు దిద్దుకోవడానికి ఇంకా అధికారపార్టీకి మూడేళ్ళ సమయం ఉంటుంది.  
 
ఇక కొంతమంది వైసిపి హార్డ్ కొర్ అభిమానులు వ్యక్తం చేసే బాధ ఏమిటంటే లాబీయింగ్ లో జగన్మోహన్ రెడ్డి విఫలం అవుతున్నాడని.  ఒకవంక వ్యవస్థలను మేనేజ్ చేస్తాడని, ఎవరినైనా కొనేస్తాడని చంద్రబాబు మీద ఆరోపణలు చేసే వారు తమ నాయకుడు ఆ పని చెయ్యడం లేదని బాధపడటంలో ఔచిత్యం ఉందా?  జగన్ ముక్కుసూటితనమే ఆయనకు ప్రజాదరణను తెచ్చిపెట్టింది.  కోర్టులో కేసు ఓడిపోయినంతమాత్రాన విమర్శలు ఎక్కుపెట్టడం తగదు.  దానికి అనేక కారణాలు ఉంటాయి.  కానీ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిజాయితీని శంకించలేము.  పాలనలో విఫలం అయినపుడు మాత్రమే నాయకుడు విమర్శలకు అర్హుడు అవుతాడు.  కొంతమంది ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నా, ఎన్ని స్టేలు ఉన్నా, ఎన్నేళ్లయినా చట్టాన్ని తప్పించుకుని తిరుగుతుంటారు.  అది వ్యవస్థల్లో లోపం తప్ప వ్యక్తుల్లో కాదు.  తప్పు చేయనివాడు, విశుద్ధ అంతరాత్మ కలిగినవాడు తాత్కాలిక అపజయాలకు భయపడరాదు.  
 
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు