వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) మళ్లీ టార్గెట్ అయింది. గతంలో జగన్ ఎదుర్కొన్న ఆస్తుల కేసులు, విచారణలు, జైలు ప్రయాణం తెలుగు రాష్ట్రాలకు తెలిసిందే. కానీ ఈసారి వేరు.. మద్యం కుంభకోణం వ్యాప్తి కొత్త దిశగా మారింది. మూడు వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ మరింతగా దృష్టి సారించడం ఇప్పుడు పార్టీని కుదిపేస్తోంది.
ఈ కేసును ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం పరిశీలిస్తుండగా, ఈడీ కేంద్రం నుంచి తాజాగా లేఖ అందింది. కేసు సంబంధిత అన్ని వివరాలు, ఆధారాలు, జరిపిన దర్యాప్తు వివరాలను 24 గంటల్లో అందించాలన్న ఆదేశం సీఎం కార్యాలయం నుంచి అధికారులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు, విచారణ బృందాలు కసరత్తు ప్రారంభించాయి. అసలు మద్యం లాబీ వెనుక ఉన్న వ్యవహారాలు, లెక్కల్లో కనిపించని డబ్బులు ఒక్కొక్కటిగా వెలుగులోకి రానున్నాయని సమాచారం.
ముఖ్యంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ మిధున్రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాలు ఆందోళనలో మునిగిపోయాయి. ఇంతవరకు ఈడీ కేసులు ఎప్పుడూ చూడని వారు, ఇప్పుడు తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. ఒక్కసారి ఈడీ రంగంలోకి దిగితే, మెల్లమెల్లగా కేసులు కూల్చడం, నెలల తరబడి విచారణ జరపడం అలవాటు. చివరకు నిజాలు బయటకు రావడం తప్పదని పరిశీలకుల అభిప్రాయం. వైసీపీ శ్రేణుల్లో ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్తుందో చూడాలి.