Pahalgam Terror Attack: పహల్గామ్ దాడిపై ట్రంప్ స్పందన: మోదీకి ఫోన్, పూర్తి మద్దతు ప్రకటించిన అమెరికా

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతిచెందిన ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా స్పందన వ్యక్తమవుతోంది. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు.

ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “డొనాల్డ్ ట్రంప్ గారు ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రవాద దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాదంతో పోరాటంలో అమెరికా ఎప్పటికీ భారత్‌కు పక్కన నిలుస్తుందని పేర్కొన్నారు,” అని జైస్వాల్ ట్వీట్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కూడా స్పందిస్తూ, “కశ్మీర్ ఘటన చాలా బాధాకరం. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. భారత ప్రజలకు, మోదీకి మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను,” అని పేర్కొన్నారు.

మరోవైపు పహల్గామ్ దాడి జరిగిన వెంటనే ప్రధాని మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించారు. మంగళవారం రాత్రి జెడ్డా నుంచి హుటాహుటిన భారత్‌కు తిరిగి వచ్చారు. ఢిల్లీలో ఆయన అత్యవసర భద్రతా సమీక్ష నిర్వహించారు. ట్రంప్ మద్దతు దేశీయ, అంతర్జాతీయంగా భారత్‌కు మరింత బలం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు.

Insta Influencer Broken Boy Mani Exclusive Interview | Broken Boys Mani Breakup Story | TeluguRajyam