వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్ళ పట్టాల కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. వివాదాలున్న భూములు మినహాయిస్తే, మిగిలిన చోట్ల ఇళ్ళ పట్టాల పంపిణీ ఓ ‘పండగలా’ జరుగుతున్నప్పటికీ, సొంత పార్టీలోని లుకలుకలు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య ఆధిప్యత పోరు.. కింది స్థాయి నాయకుల మధ్య లుకలుకలు.. ఇవన్నీ అధికార పార్టీకి సంకటంగా మారుతున్నాయి. దాదాపు చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘వైసీపీని నమ్ముకున్నవారికి కాకుండా, వేరొకరి పట్ల అమితమైన ప్రేమతో ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు.. పైగా, అలా ఇళ్ళ పట్టాల్ని పొందుతున్నవారికి ఇప్పటికే పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి..’ అంటూ కొన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వైసీపీ నేతలు, కార్యకర్తలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ‘ముందే ఆయా స్థలాల్ని అమ్మేసుకున్నారు..
లబ్దిదారుల నుంచి పెద్దయెత్తున వసూళ్ళకు పాల్పడ్డారు..’ అని వైసీపీ నేతలు, కార్యకర్తలే ఆరోపిస్తోంటే, ఈ ఆరోపణల్ని కంట్రోల్ చేయలేక వైసీపీ అధిష్టానం బేల చూపులు చూడాల్సి వస్తోంది. ‘స్వపక్షంలోనే విపక్షం’ ఎప్పుడూ తలనొప్పి వ్యవహారమే. గట్టిగా మందలిస్తే, పార్టీ బజార్న పడిపోతుంది. మందలించకపోతే, చిన్న చిన్న గొడవలు ముదిరి పాకాన పడిపోతాయ్. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో వైసీపీ అధిష్టానానికి పాలుపోవడంలేదు. నిజానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఒక్కరే, పార్టీ వ్యవహారాల్ని చూసుకోవడం కష్టం. ఎందుకంటే, ప్రభుత్వాధినేతగా ఆయనకు అదనపు బాధ్యతలు.. అత్యంత కీలకమైన బాధ్యతలున్నాయి. కింది స్థాయిలో ఏం జరుగుతోంది.. ఎవర్ని ఎలా కంట్రోల్ చేయాలి.? అన్నది స్థానిక నాయకత్వం చూసుకోవాలి.. ఆ ఈవ్యవహారాన్ని ‘కోటరీ’ మానిటరింగ్ చేయాలి. విపక్షాల్ని విమర్శించే క్రమంలో కొందరు వైసీపీ నేతలు చాలా యాక్టివ్గా వుంటున్నారు తప్ప, ప్రజా ప్రతినిథులుగా తాము ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో.. కింది స్థాయి నేతలు, కార్యకర్తల్ని మాత్రం సరిగ్గా డీల్ చేయలేకపోతున్నారు. ఈ కారణంగా ఇప్పటికే పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల కొన్ని చోట్ల వ్యతిరేకత పెరిగిపోయిందనే భావన వ్యక్తమవుతోంది. ఇళ్ళ పట్టాల వ్యవహారంతో ప్రభుత్వానికి మంచి పేరు రావాల్సింది పోయి, చెడ్డపేరు వస్తోందంటూ కొందరు వైసీపీ నేతలు ఆఫ్ ది రికార్డ్గా వాపోతుండడం గమనార్హం.