వైసీపీ కార్యకర్త చేసిన హత్య.! ఇదా రాజకీయమంటే.?

హత్య చేసినోడు హంతకుడే అవుతాడు.! అధికార పార్టీ నాయకుడైనా, విపక్షాలకు చెందినవారైనా.. వైసీపీ హంతకుడు, టీడీపీ హంతకుడు.. ఇంకో పార్టీ హంతకుడు.. ఇలా వుండవు.! హత్యలకు పాల్పడేవాళ్ళెవరైనా, నరరూప రాక్షసులుగానే చూడాలి.

దురదృష్టం, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చిత్రంగా వుంటాయ్. జుగుప్సాకరంగా ఆ రాజకీయాలు కనిపిస్తుంటాయ్. అక్కడ జరిగేదంతా, అదే రాజకీయం.

వైసీపీ కార్యకర్త ఒకరు, పదో తరగతి చదువుకున్న విద్యార్థి ఉసురు తీశాడు. ఆ విద్యార్థి మంటల్లో కాలిపోయాడు. తీవ్ర గాయాలతో ఆ విద్యార్థి వైద్య చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. చనిపోయే ముందు, తనను కాల్చేసిన వ్యక్తి పేరు బయటపెట్టాడు. ఆ నర రూప రాక్షసుడి పేరు వెంకటేశ్వర్ రెడ్డి.

మృతుడి పేరేమో అమర్నాథ్. బాధిత కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ ప్రభుత్వం తక్షణం అందించే ప్రయత్నం చేసింది. ఆ సొమ్మని తీసుకుని, స్వయంగా ఎంపీ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళారు.

ఇలాంటి సందర్భాల్లో అధికారంలో వున్నోళ్ళూ సంయమనం పాటించాలి. పబ్లిసిటీ స్టంట్లు చేయకూడదు. ఆ సొమ్ము మీడియా కంట పడేలా చేయడంలో అధికార పార్టీ ఉద్దేశ్యమేంటి.? ఆ సంగతి పక్కన పెడితే, ‘వైసీపీలో అందరూ హంతకులే’ అంటోంది తెలుగుదేశం పార్టీ.

కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ని చంపేసిన ఘటన దగ్గర్నుంచి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు వరకు.. అన్నిటినీ లాగుతున్నారు టీడీపీ నేతలు. ఇదీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం.!