సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ అహ్మద్ ప్రేమ, పెళ్లి వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. పాకిస్థాన్ మహిళ మెనల్ ఖాన్ను వివాహం చేసుకున్నట్లు బయటపడిన నేపథ్యంలో, అతడిని విధుల నుంచి తొలగించినట్టు సమాచారం. అయితే, మునీర్ మాత్రం ఈ చర్యను అన్యాయంగా అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు వేడికొంటున్నాడు.
మునీర్ కథనం ప్రకారం, 2022 నుంచే తన ప్రేమ వ్యవహారాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాడట. 2024లో మెనల్ను వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నట్లు చెబుతున్న అతను, ఆమె భారతదేశానికి వచ్చిన విషయం కూడా అధికారులకు తెలుసని వాదిస్తున్నాడు. కానీ ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ దేశం విడిచి వెళ్లకపోవడమే ప్రధాన అభియోగంగా అధికారులు చూపుతున్నారు.
ఇటీవల పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్-భారత్ సంబంధాలు మరింత ఉద్రిక్తతకు చేరడంతో, దేశంలో ఉన్న పాకిస్తానీ పౌరులపై ప్రభుత్వ దృష్టి పెరిగింది. ఇదే సందర్భంలో మునీర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీఆర్పీఎఫ్ అంతర్గత నిబంధనలకు విరుద్ధంగా విదేశీ వ్యక్తితో సంబంధాలు కొనసాగించడం, సమాచారం పూర్తిగా వెల్లడించకపోవడం వంటి అంశాలపై అతనిపై చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.