CM Revanth Reddy: నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ అకాల మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించిన సీఎం, శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఆ కుటుంబాన్ని తీరని దుఃఖసాగరంలో ముంచింది” అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం స్పష్టం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ దిశగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
కార్మికులకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి: ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు ఎవరూ మనస్తాపానికి గురికావద్దని మరియు తొందరపాటు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కార్మికుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆందోళనలు వదిలి, ప్రభుత్వ చర్చలకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కార్మికుల ప్రాణాలు ఎంతో విలువైనవని, ఏ సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

