సినిమాలు వేరు, రాజకీయం వేరు. సినిమాల్లో ‘అందరివాడు’ అనిపించుకున్నా, రాజకీయాల్లో మాత్రం ‘కొందరివాడి’గా మిగిలిపోవాల్సి వస్తుందనే విషయం చిరంజీవికి అర్థమయ్యింది. అందుకే, పొలిటికల్ స్టార్ అనే ఇమేజ్ పక్కన పెట్టేసి, మెగాస్టార్ అనే ఇమేజ్కే పరిమితమైపోవాలనుకున్నారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ అధినేత, కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మంత్రి.. ఇలా రకరకాల పదవులు పక్కన పెట్టి, ‘అందరివాడు’ మెగాస్టార్.. అని మళ్ళీ అనిపించుకునేందుకు సినిమాల్లో బిజీ అయిపోయిన మెగాస్టార్ చిరంజీవిని, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తన వ్యాఖ్యలతో డిఫెన్స్లో పడేశారు. మెగా కాంపౌండ్, నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క, మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటికే నాదెండ్ల మనోహర్తో మాట్లాడి, అన్నయ్యను వివాదాల్లోకి లాగడం సబబుగా లేదని ఆవేదన వ్యక్తం చేశారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఇదంతా వ్యూహాత్మక రాజకీయం.. అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒక్కటి మాత్రం నిజం.
చిరంజీవి ఇప్పుడు అందరివాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కూడా అలాంటి సన్నిహిత సంబంధాలే వున్నాయి చిరంజీవికి. బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు, చిరంజీవి పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు, బీజేపీలోకి ఆయన్ని లాగేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా. ఇలాంటి తరుణంలో నాదెండ్ల మనోహర్ ఎందుకు తొందరపడ్డారు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో చిరంజీవి ఆచి తూచి స్పందిస్తుంటారు. చిరంజీవి కంటే ముందే, మెగా కాంపౌండ్కి చెందిన పలువురు ముఖ్యులు.. నాదెండ్ల మనోహర్కి తమ నిరసనను తెలియజేశారట కూడా. మరోపక్క, పవన్ కళ్యాణ్ కూడా ‘ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది.?’ అంటూ నాదెండ్ల మనోహర్కి క్లాస్ తీసుకున్నారని సమాచారం. పంచాయితీ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా చిరంజీవి ఇమేజ్ ఉపయోగపడుతుందనే కోణంలోనే నాదెండ్ల అలా మాట్లాడి వుండొచ్చుగానీ, చిరంజీవి మాత్రం ఈ ప్రకటనను అస్సలేమాత్రం స్వాగతించే పరిస్థితి వుండదు. ఎందుకంటే, ఇది సమయం.. సందర్భం కానే కాదు ఇలాంటి విషయాలకు.