Pak Airlines: పాకిస్థాన్‌పై గగనతల చర్యలు? కేంద్రం కీలక నిర్ణయానికి రంగం సిద్ధం

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌-పాక్ మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌ భారత విమానాల గగనతల ప్రవేశాన్ని నిషేధించిన నేపథ్యంలో, భారత్ కూడా పాక్ ఎయిర్‌లైన్లపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గగనతలాన్ని మూసివేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం.

ప్రస్తుతం పాక్ విమానాలు సింగపూర్‌, మలేసియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు వెళ్లాలంటే భారత గగనతలాన్ని దాటాల్సి వస్తుంది. భారత్ నిషేధం విధిస్తే, పాక్ విమానాలకు ప్రయాణ దూరం పెరగడం ఖాయం. దీంతో నిర్వహణ వ్యయాలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ఇది మరింత భారంగా మారే అవకాశం ఉందని విమానయాన నిపుణులు చెబుతున్నారు.

ఇక భారత్‌పై గగనతల నిషేధం విధించిన పాకిస్థాన్ ఇప్పటికే పెద్ద నష్టం చవిచూస్తోంది. వారానికి 800 పైగా అంతర్జాతీయ విమానాలు పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించేవి. ఓవర్‌ఫ్లైట్ ఛార్జీల కింద రోజుకు సుమారు 1.20 లక్షల డాలర్లు పాక్ సంపాదించేది. ప్రస్తుతం ఈ మొత్తం నష్టంగా మారిపోతోంది.

భారత్ కూడా పాక్ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తే, ఆ దేశ విమానయాన రంగానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. మరోవైపు, పాక్ విమానాలకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చైనా లేదా శ్రీలంక గగనతలాలను ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇది ప్రయాణ సమయం పెరిగే పరిస్థితి తీసుకురాగలదు. మొత్తానికి పహల్గామ్ ఘటన అనంతర పరిణామాలు రెండు దేశాల గగనతల రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. కేంద్రం తీసుకోబోయే తుది నిర్ణయం పాక్ ఎయిర్‌లైన్లకు గట్టి గుణపాఠం నేర్పించేలా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

శ్రీవిష్ణుపై మంచు విష్ణు ఫైర్ || Dasari Vignan Reacts On Sree Vishnu Imitates Manchu Vishnu || TR