భారతదేశంలో సినిమాను, రాజకీయాలనూ వేరు చేసి చూడలేని పరిస్థితులు వచ్చేశాయనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులు, మంత్రులు అయినవారు ఉండగా.. సినిమాల్లో పెట్టుబడులు పెట్టే ప్రజాసేవకులూ ఉన్నారని చెబుతారు. మరోవైపు.. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల ప్రచారం చాలా ప్లస్ అవుతుందని.. మరోవైపు సినిమాల విడుదల, టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం, అంతకంటే ముందు సెన్సార్ సర్టిఫికెట్ సమయానికి అందుకోవడం వంటి విషయాల్లోనూ ప్రభుత్వాల అవసరం చాలానే ఉంటుందని అంటారు. ఈ విషయాన్ని.. టీవీకే అధినేత విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో జరిగిన పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయని చెబుతున్నారు!
ఇక ఇటీవల ‘పుష్ప – 2’ సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట, అనంతర పరిణామాలు తెలిసిన వ్యవహారమే! ఇక ఏపీ విషయానికొస్తే ఇప్పటికే పలువురు స్టార్స్ అభిమానులు పార్టీలుగా విడిపోయిన పరిస్థితి. ఆ దిశగానే విడుదల సందర్భంగా థియేటర్స్ వద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఈ స్థాయిలో రాజకీయాలు, సినిమా పెనవేసుకుపోయాయని అంటున్నారు. మరోవైపు.. అందుకే రాజకీయ నాయకులకు, సినీ నటులకు మధ్య అధికారికంగా రాసుకోని ఒక ఒప్పందం ఉందని అంటుంటారు. ఈ బంధం సినిమా విడుదల నుంచి అవార్డుల వరకూ పని చేస్తుంటుందని, తనదైన ప్రభావం చూపిస్తుంటుందని చెబుతుంటారు.
ఉదాహరణకు.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ నేత ఇంటికి అల్లు అర్జున్ వెళ్లిన విషయం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల సంగతి అటుంచితే.. ఈ క్రమంలో ‘పుష్ప-2’ సినిమా విడుదల సమయంలో వైసీపీ క్యాడర్ ఓన్ చేసుకున్నారని అంటారు. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా విడుదలైన ‘ధురంధర్ – 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల విషయంలో నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చను తెరపైకి తెచ్చాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఈ సందర్భంగా ఆసక్తిగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే… తమ ఎన్నికల ప్రచారాలకు, రాజకీయాలకు బాలీవుడ్ ని భారతీయ జనతా పార్టీ పుష్కలంగా వాడేసుకుంటుందని.. అందుకు పలు ఉదాహరణలు చూపిస్తూ ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థులు కామెంట్స్ చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే… తాజాగా విడుదలైన ‘ధురంధర్’ ని పలువురు అభివర్ణిస్తుంటారని అంటారు! ఇక, ఉగాది సందర్భంగా విడుదలైన ‘ధురంధర్ – 2’ కు పలువురు టాలీవుడ్ స్టార్స్ ఆన్ లైన్ వేదికగా స్పందిస్తూ, ప్రోత్సహించడం వెనుక భారతీయ జనతా పార్టీ రాజకీయ ఒత్తిడి ఉందనేది ప్రకాశ్ రాజ్ తాజా సంచలన ఆరోపణగా ఉంది.
రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ – 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ధురంధర్ ఫస్ట్ పార్ట్ పలు రికార్డులు సృష్టించగా.. ఆ ఎఫెక్ట్ తో సెకండ్ పార్ట్ కూ భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.. ఆ నమ్మకాన్ని సినిమా నిలబెట్టుకుంది. మరోవైపు ఇది బీజేపీ మార్కు రాజకీయ ప్రచార చిత్రం అంటూ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాను ‘ఎక్స్’ వేదికగా ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు!
దీంతో… ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే… ఈ సినిమాపై వస్తున్న ప్రశంసలు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఒత్తిడి రాజకీయాలు’ ఇప్పుడు దక్షిణాదిలోకి కూడా ప్రవేశించాయని కామెంట్ చేశారు. దీంతో.. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి స్టార్ హీరోలకు వచ్చిందని ఆయన పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారనే ప్రచారం ఊపందుకుంది!
ఈ నేపథ్యంలో… కాసేపు ప్రకాశ్ రాజ్ ఆరోపణలు నిజమని అనుకుంటే.. అదే బీజేపీ తమ కూటమిలోని కీలక నేత అయిన పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం కూడా ఓ పోస్ట్ పెట్టించి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. అలాకానిపక్షంలో.. బీజేపీ ‘ఉస్తాద్’ కోసం నిలబడలేదు.. పవన్ ను తమ ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేసింది తప్ప, ఓన్ చేసుకోలేదు అనే చర్చనూ తెరపైకి తెస్తున్నారు. ఏది ఏమైనా.. ప్రకాశ్ రాజ్ చేసిన తాజా పోస్ట్ మాత్రం ఆసక్తికర చర్చకు తెరలేపిందని చెబుతున్నారు పరిశీలకులు!
కాగా… ధురంధర్ – 2 సినిమా గురించి ఎక్స్ వేదికగా టాలీవుడ్ స్టార్ హీరోలు స్పందించడం.. అదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మౌనాన్ని ఆశ్రయించడం వంటి విషయాలపై అటు అభిమానుల్లోనూ, ఇటు సినీ జనాల్లోనూ చర్చ జరిగిన సంగతి తెలిసిందే!
